దోశ, ఇడ్లీ, జావ మిక్స్ వంటి ఆహార పదార్థాలను పౌడర్(పొడి పిండి) రూపంలో విక్రయిస్తే 18 శాతం పన్ను విధించాల్సిందేనని తమిళనాడు అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్) స్పష్టం చేసింది. ఇవే పదార్థాలను నీటితో కలిపిన పిండి(బ్యాటర్) రూపంలో అమ్మితే మాత్రం జీఎస్టీ 5 శాతంగా ఉంటుందని తెలిపింది.
జొన్నలు, సజ్జలు, రాగులు, తృణధాన్యాలను మిశ్రమం రూపంలో విక్రయిస్తే.. వాటి వర్తించే జీఎస్టీకి సంబంధించి కృష్ణ భవన్ ఫుడ్స్ అండ్ స్వీట్స్ అనే సంస్థ అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్ (ఏఏఆర్)ను ఆశ్రయించింది. ఈ మేరకు తమిళనాడు ఏఏఆర్ బెంచ్లో ఓ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై తీర్పులో భాగంగా ఏఏఆర్ తాజా వ్యాఖ్యలు చేసింది. ఈ సంస్థ విక్రయించే ఉత్పత్తులన్నీ పౌడర్ రూపంలో ఉన్నట్లు ఏఏఆర్ గుర్తించింది.
"దోశ, ఇడ్లీ మిశ్రమాలను పౌడర్(పొడి పిండి) రూపంలో విక్రయిస్తున్నారు. వీటిని వినియోగదారులు నీరు లేదా పెరుగుతో కలిపిన తర్వాత ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అది తడి పిండి(బ్యాటర్)గా మారుతుంది. మీరు విక్రయిస్తున్న ఉత్పత్తులు పౌడర్ రూపంలో ఉన్నాయి. బ్యాటర్ రూపంలో కాదు. మీరు పేర్కొన్న 49 ఉత్పత్తులపై.. సీటీహెచ్ 2016 నిబంధనల ప్రకారం 9 శాతం సీజీఎస్టీ, 9 శాతం ఎస్జీఎస్టీ వర్తిస్తుంది."
-ఏఏఆర్ ఆదేశాలు
కృష్ణ భవన్ అనే సంస్థ దోశ, ఇడ్లీ మిశ్రమాలను ప్యాక్ చేసి పొడిగా విక్రయించేది. అందుకుగాను ఐదు శాతం జీఎస్టీ చెల్లించేది. అయితే ఏఏఆర్ తాజా తీర్పు.. పన్ను వ్యవస్థలో సందిగ్ధతకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'ఫాంటా' ఆమ్లెట్.. ట్రై చేయండి ఒకసారి!