సాధారణంగా పోలీస్ స్టేషన్లు ఒకే రంగులో ఉంటాయి. దాదాపు అన్ని స్టేషన్లలోనూ.. ఒకే తరహా వాతావరణం ఉంటుంది. అయితే, తమిళనాడులోని రాణిపేట జిల్లాలోని ఠాణాలు మాత్రం ఇందుకు మినహాయింపు. ఇక్కడ స్టేషన్లన్నీ సప్త వర్ణాలతో కనువిందు చేస్తాయి. వివిధ రకాల బొమ్మలు, చక్కటి రాతలతో అలరిస్తాయి. దీని వెనక ఉన్న ఆలోచన ఓ విశ్రాంత పోలీసు ఉన్నతాధికారిది. 5 లక్షల రూపాయలతో ప్రారంభించిన.. ఈ వినూత్న కార్యక్రమంలో ప్రముఖ రంగుల తయారీ సంస్థ నిప్పన్ కూడా పాలుపంచుకుంటోంది.
అందులో భాగమే..
గతంలో రాణిపేట జిల్లాకు ఎస్పీగా పనిచేసిన మిల్వగనన్ ఈ ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. రాణిపేట గతంలో వెల్లూరు జిల్లాలో ఉండేది. 2019లో వెల్లూరును 3 జిల్లాలుగా విభజించడం వల్ల ఇది జిల్లాగా ఏర్పడింది. ఈ జిల్లాకు మొదటి ఎస్పీగా మిల్వగనన్ పనిచేశారు. బాధ్యతలు చేపట్టిన తర్వాత అక్కడి పోలీసింగ్లో ఆయన పలు మార్పులు తీసుకువచ్చారు. అందులో భాగమే ఠాణాల సుందరీకరణ.
మినీ పార్కులు సైతం..
పోలీస్ స్టేషన్ అనేది భయపెట్టే ప్రదేశంగా ఉండకూడదని మిల్వగనన్ చెబుతారు. క్షణికావేశంతో తప్పులు చేసిన వారి జీవితం జైల్లోనే మిగిలిపోకూడదని ఆయన అంటారు. ఈ పెయింటింగ్లు వారి జీవితానికి ఉత్తేజితం కలిగించేలా, ఆశలు చిగురించేలా ఉండాలని అభిప్రాయపడ్డారు. రాణిపేట జిల్లాలోని 22 పోలీస్స్టేషన్లకు చూడచక్కటి రంగులను ఆయన వేయించారు. పెయింటింగ్లతో పాటు స్టేషన్ల విజిటింగ్ గదుల్లో లైబ్రరీలు, మహిళా పోలీస్ స్టేషన్లలో మినీపార్కును కూడా ఏర్పాటు చేశారు.
మాజీ ఎస్పీ మిల్వగనన్ ఆలోచనను, దానిని ఆచరణలో పెట్టేందుకు చేసిన కృషిని సామాజిక కార్యకర్తలు, స్థానికులు కొనియాడుతున్నారు.
ఇదీ చూడండి: ఇది హోటల్ కాదు గురూ.. పోలీస్స్టేషన్