ఉత్తర్ప్రదేశ్లోని కుషీనగర్లో నిర్మించిన కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు ప్రధాని నరేంద్ర మోదీ. దశాబ్దాల ఆశలు, అంచనాలు ఫలించాయని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో విమానాయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, ఉత్తర్ప్రదేశ్ గవర్నర్ ఆనందిబెన్ పటేల్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పాల్గొన్నారు. శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స కుమారుడు, క్రీడా శాఖ మంత్రి రాజపక్స కూడా హాజరయ్యారు.
![PM inaugurates Kushinagar international airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13404838_airport.jpg)
కుషీనగర్ ఎయిర్పోర్ట్ విమానయాన రంగానికి సరికొత్త శక్తిని ఇస్తుందని, పర్యటకం కొత్త పుంతలు తొక్కుతుందని అభిప్రాయపడ్డారు మోదీ. పెట్టుబడులు పెరుగుతాయని, ఉద్యోగాల కల్పన జరుగుతుందని అన్నారు.
![PM inaugurates Kushinagar international airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13404838_modi2.jpg)
''దశాబ్దాల తరబడి ఆశలు, ఎన్నో అంచనాల సాకారమే.. కుషీనగర్ విమానాశ్రయం. ఈ రోజు నా సంతోషం రెట్టింపైంది. నా జీవిత ప్రయాణంలో ఇప్పుడు సంతృప్తి నెలకొంది.''
- నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
మందిరంలో పూజలు..
అనంతరం.. మహాపరినిర్వాణ మందిరాన్ని సందర్శించారు మోదీ. అక్కడ బుద్ధుడికి పూజలు చేసి.. విగ్రహానికి చీవర్(ఒక వస్త్రం) సమర్పించారు. ఆ తర్వాత.. ఒక బోధి వృక్షం కూడా నాటారు.
![PM inaugurates Kushinagar international airport](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/13404838_tree.jpg)
అభిధమ్మ దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన మోదీ.. అక్కడ బౌద్ధ సన్యాసులకు కూడా చీవర్లు అందజేశారు. శ్రీలంక, థాయిలాండ్, మయన్మార్, దక్షిణ కొరియా, నేపాల్, భూటాన్, కంబోడియా సహా ఇతర దేశాల నుంచి ప్రతినిధులు ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.
తీర్థయాత్రలకు ఊతం..
కుషీనగర్ బౌద్ధులకు అత్యంత ప్రసిద్ధ క్షేత్రాల్లో ఒకటి. గౌతమ బుద్ధుడు.. తన చివరి రోజుల్లో (మహాపరినిర్వాణం) ఇక్కడే గడిపారు. అందుకే ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ సాధువులు ఏటా ఇక్కడకు వస్తుంటారు. ముఖ్యంగా శ్రీలంకలో నివసించే బౌద్ధులు.. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని సందర్శించడానికి మార్గం సులభం కానుంది. వీరికి సౌలభ్యం కల్పించడం సహా బౌద్ధ తీర్థయాత్రను మరింత ప్రోత్సహించే విధంగా ఇక్కడ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేసింది మోదీ ప్రభుత్వం. దాదాపు రూ.260కోట్లతో దీన్ని నిర్మించింది.
ఇదీ చూడండి: 'వారు ఎంతటి బలవంతులైనా విడిచిపెట్టేది లేదు'