Plane Two Fuel Tanks Fell Down : ఉత్తర్ప్రదేశ్.. సంత్ కబీర్నగర్ జిల్లాలో విమానం నుంచి వరి పొలంలోకి రెండు ఇంధన ట్యాంకులు పడిపోయాయి. ఈ క్రమంలో పొలంలో పనిచేస్తున్న రైతులు, కూలీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీ శబ్దంతో ఇంధన ట్యాంకులు పొలంలో పడడం వల్ల ఏం జరిగిందో అర్థం కాక కంగారుపడ్డారు. ఎవరూ ఇంధన ట్యాంకుల వద్దకు వెళ్లే సాహనం చేయలేదు. సోమవారం మధ్యాహ్నం జరిగిందీ ఘటన.
ఇంధన ట్యాంకుల వద్దకు బంజారియా బలుశాషన్ గ్రామస్థులు, రైతులు వెళ్లలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఎస్పీ సత్యజిత్ గుప్తా పోలీసు బృందంతో ఘటనాస్థలికి చేరుకున్నారు. జరిగిన విషయాన్ని భారత వైమానిక దళానికి తెలియజేశారు. పొలంలో పడిన ఇంధన ట్యాంకును చూసేందుకు చుట్టూపక్కల గ్రామస్థులు ఎగబడ్డారు.
"వరి పొలంలో కలుపు తీస్తున్నాం. పెద్ద శబ్ధం వినిపించింది. ఏం జరిగిందోనని రైతులు, కూలీలు భయపడ్డారు. క్షిపణి లాంటివి రెండు పొలంలో పడ్డాయి. అవి పేలుతాయని భయపడ్డాం. అందుకే వాటి దగ్గరకు ఎవరూ వెళ్లలేదు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాం. వారు పొలంలో పడినవి.. విమానం ఇంధన ట్యాంకులని చెప్పడం వల్ల ఊపీరి పీల్చుకున్నాం. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు."
--రైతు
'సాంకేతిక లోపం వల్ల అలా చేయాల్సి వచ్చింది'
భారత వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల బాహ్య ఇంధన ట్యాంకును పైలట్.. నేలపైకి జారవిడిచేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. "ఆ ఇంధన ట్యాంకు ఉత్తర్ప్రదేశ్లోని సంత్ కబీర్నగర్ జిల్లాలో ఉన్న బంజారియా బలుశాషన్ అనే గ్రామంలో పడింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఆస్తి నష్టం కూడా జరగలేదు" అని అధికారులు పేర్కొన్నారు. ఇంధన ట్యాంకు వరి పొలంలో పడిన సమాచారాన్ని జిల్లా ఎస్పీ.. వాయుసేనకు తెలియజేశారు. సాధారణ శిక్షణలో భాగంగా ఈ విమానం ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ నుంచి నింగిలోకి పయనమైంది. అది వైమానిక దళానికి చెందిన జాగ్వార్ యుద్ధ విమానమని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.