వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మరో 60 లక్షల కరోనా టీకా డోసులను మూడు రోజుల్లోగా సరఫరా చేస్తామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటివరకు రాష్ట్రాలకు, కేంద్రాలకు కలిపి 16.54 కోట్లు టీకా డోసులను ఉచితంగా అందజేసినట్లు చెప్పింది. వాటిలో వృథా అయిన టీకాలతో కలిపి 15,79,21,537 టీకా డోసులు వినియోగించారని పేర్కొంది.
"రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వద్ద మరో 75 లక్షల టీకా డోసులు ఉన్నాయి. వీటికి అదనంగా 59,70,670 టీకా డోసులను మూడు రోజుల్లోగా పంపిస్తాం."
- కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ
మరోవైపు.. ఏప్రిల్ 19న కేంద్ర ప్రభుత్వం నూతన వ్యాక్సిన్ పాలసీని తీసుకువచ్చింది. దీనిప్రకారం.. మే 1 నుంచి 18 ఏళ్లు దాటిన వారికి టీకా అందించేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. అయితే.. ఇందుకోసం వ్యాక్సిన్ తయారీదారుల నుంచి రాష్ట్రాలే స్వయంగా టీకాలు కొనుగోలు చేయాలని తెలిపింది.
ఇదీ చూడండి: హైకోర్టుల పాత్రపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఇదీ చూడండి: ఆక్సిజన్ కొరత- కొవిడ్ ఆస్పత్రిలో 24మంది మృతి