అప్పుడే పుట్టిన పిల్లలు సాధారణంగా 2.3 కేజీల నుంచి 3.7 కేజీల వరకు బరువుంటారు. కానీ, మధ్యప్రదేశ్ మండలా జిల్లాకు చెందిన ఓ మహిళ బేబీ బాహుబలికి జన్మనిచ్చింది. ఈ బాలిక ఏకంగా 5.1 కేజీల బరువుండడం గమనార్హం.

"రక్ష కుశ్వాహా అనే మహిళ శనివారం 5.1 కేజీల బిడ్డకు జన్మనిచ్చారు. అంజనియా ప్రైమరీ హెల్త్కేర్ సెంటర్లో ఆమె ప్రసవం జరిగింది. పిల్లలు ఇంత బరువుతో పుట్టడం చాలా అరుదు."
--డాక్టర్.అజయ్ తోష్ మరావి, హెల్త్ సెంటర్ ఇంఛార్జి.
శిశువు ఎత్తు 54 సెంటీమీటర్లు అని డాక్టర్లు తెలిపారు. పుట్టినప్పుడు శిశివు ఆరోగ్యంగానే ఉన్నా.. ఆదివారం మధ్యాహ్నం నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చినట్లు పేర్కొన్నారు. మండలా జిల్లా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

సాధారణంగా షుగర్, అధిక బరువు, హార్మోన్ సమస్యలున్నవారే ఎక్కువ బరువున్న పిల్లలకు జన్మనిస్తారని డాక్టర్ మరావి అన్నారు. కుశ్వాహా మాత్రం డయోబెటిక్ రోగి కాకపోయినా అధిక బరువున్న బేబీకి జన్మనిచ్చారని తెలిపారు.
శిశువు ఇంత బరువుతో పుట్టడంపై కుశ్వాహా కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
