రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని బహుజన్ సమాజ్వాదీ పార్టీ అధినేత్రి మాయావతి స్పష్టం చేశారు. ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూలోని బీఎస్పీ కార్యాలయంలో తన 67 పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఆమె ఈ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. ఆ తర్వాత ఈవీఎంల పనితీరుపై కొన్ని ప్రశ్నలను లేవనెత్తారు. ఈ కార్యక్రమంలో తాను రాసిన 18వ ఎడిషన్.. "ఎ ట్రావెలాగ్ ఆఫ్ మై స్ట్రగుల్-రిడెన్ లైఫ్ అండ్ బీఎస్పీ మూవ్మెంట్" పుస్తకాన్ని విడుదల చేశారు మాయావతి. అనంతరం తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
"వచ్చే ఎన్నికల్లో బీఎస్పీ.. ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోదు. సొంతంగానే ఎన్నికల్లో పోటీ చేస్తాం. కాంగ్రెస్, మరికొన్ని పార్టీలు మాతో పొత్తు పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ మా సిద్ధాంతం ఇతర పార్టీల కంటే భిన్నమైనది. విపక్షాలు బీఎస్పీని లక్ష్యంగా చేసుకుని ముందుకు వెళ్లనీయకుండా ఆపేస్తున్నాయి. రాష్ట్రంలో నాలుగుసార్లు బీఎస్పీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. పేదలకు, అర్హత ఉన్న వారికి సంక్షేమ పథకాలు అందించి ప్రజల కోసం పనిచేసింది. ప్రస్తుతం అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. ధనవంతుల సాయం తీసుకోకుండా.. వెనుకబడిన ప్రజల కోసం బీఎస్పీ పనిచేస్తోంది".
-- మాయావతి, బీఎస్పీ అధినేత్రి
ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై ఆమె కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. 'ఈవీఎంల్లో కొన్ని లోపాలు ఉన్నాయి. కొందరు వాటిని దుర్వినియోగం చేస్తున్నారు. బ్యాలెట్ పేపర్ల కాలంలో జరిగిన అన్ని పోల్స్లోనూ.. బీఎస్పీకి అధిక ఓట్లు, సీట్లు వచ్చాయి. మళ్లీ బ్యాలెట్ పేపర్తోనే ఎన్నికలు నిర్వహించాలి' అని మాయావతి అన్నారు.