ఉత్తర్ప్రదేశ్లో పదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి మరణ శిక్ష విధించింది పోక్సో ప్రత్యేక న్యాయస్థానం. ఈ ఘటన 2020 డిసెంబరులో జరగగా.. మూడున్నర నెలల్లోనే తీర్పు వెలువరించింది.
అప్పుడేమైందంటే..?
ఫిరోజాబాద్లోని జస్రానా పోలీసు స్టేషన్ పరిధిలోని ఓ గ్రామానికి చెందిన నీరజ్.. 2020 డిసెంబర్ 14న అదే ప్రాంతానికి చెందిన ఓ బాలికను అపహరించాడు. అనంతరం బాలికను ఏకాంత ప్రదేశానికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని.. నిందితుడికి నేరాన్ని ధ్రువీకరించేలా అన్ని ఆధారాలు సేకరించారు.
రాజస్థాన్లో మరో వ్యక్తికి జీవిత ఖైదు
రాజస్థాన్లో ఇద్దరు మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జీవిత ఖైదు విధించింది పోక్సో కోర్టు. రెండేళ్ల క్రితం జరిగిన ఘటనలో ఎట్టకేలకు తీర్పు వెలువరించింది ధర్మాసనం.
అసలేం జరిగింది?
చిత్తోర్గఢ్కు చెందిన హిరాలాల్ ఖతి.. దాబి జిల్లాలోని ఓ వ్యక్తి ఇంట్లో అద్దెకు ఉండేవాడు. ఈ క్రమంలోనే 2019లో బయట ఆడుకుంటున్న ఐదారేళ్ల వయసున్న ఆ ఇంటి యజమాని కుమార్తెలకు చాక్లెట్ ఆశ చూపించి.. ఓ గదిలోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న బాలికల తండ్రి.. ఆ ఏడాది జులై 4న ఖతిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. ఖతిని వెంటనే అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నిందితుడు జైల్లో ఉన్నాడు. ఈ కేసులో సాక్ష్యాధారాలు పరిశీలించిన రాజస్థాన్లోని బుంది పోక్సో కోర్టు ఖతిని దోషిగా తేల్చింది. జీవిత ఖైదు విధించింది.
ఇదీ చూడండి: డబ్బుల కోసం కిడ్నాప్ డ్రామా.. చివరకు?