లఖింపుర్ ఖేరీ హింసాత్మక ఘటన నేపథ్యంలో రైతు సంఘాలు సోమవారం రైల్ రోకో చేపట్టాయి. ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి.

లఖింపుర్ ఖేరి ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితునిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రిగా ఉన్న అజయ్ను మంత్రి వర్గం నుంచి తొలగిస్తే బాధితులకు న్యాయం జరుగుతుందని.. రైల్ రోకోకు పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా పేర్కొంది. ఈ మేరకు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రైళ్ల రాకపోకలను స్తంభించేలా చేయాలని పిలుపునిచ్చింది. అయితే ధర్నా ప్రశాంతంగా సాగాలని కోరింది. రైతులు ఎవరూ రైల్వే ఆస్తుల విధ్వంసానికి పాల్పడవద్దని సూచించింది.

లఖింపుర్ ఖేరి ఘటనలో మొత్తంగా 8 మంది చనిపోయారు. వీరిలో నలుగురు రైతులు కూడా ఉన్నారు. ఈ ఘటన జరిగిన సమయంలో కారులో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి.

కఠిన చర్యలు తీసుకుంటాం..
రైతు సంఘాలు పిలుపునిచ్చిన రైల్ రోకోలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తర్ప్రదేశ్ లఖ్నవూ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు నగరంలో 144 సెక్షన్ విధించారు. నలుగురు కంటే ఎక్కువమంది గుమిగూడి కనిపిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. శాంతిభద్రతలు విఘాతం కలిగిస్తే వారిపై దేశద్రోహ చట్టం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.
నిలిచిన రాకపోకలు..
రైతు సంఘాలు చేపట్టిన రైల్రోకోతో పంజాబ్లోని కొన్ని ప్రాంతాల్లో రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఫిరోజ్పుర్ డివిజన్లోని నాలుగు సెక్షన్లను ఆందోళనకారులు అడ్డుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. నగరంలోని ఫిరోజ్పూర్-ఫాజిల్కా, మొగాలోని అజిత్వాల్ వద్ద ఉన్న ఫిరోజ్పుర్- లూధియానా వైపు నడిచే రైళ్లలు స్తంభించినట్లు పేర్కొన్నారు. అంతేగాకుండా నార్త్ రైల్వే జోన్ పరిధిలోని 30 ప్రాంతాలపై రైల్రోకో ప్రభావం పడిందని స్పష్టం చేశారు. 8 రైళ్లను దారి మళ్లించినట్లు చెప్పారు.