ఆడుతూ పాడుతూ, చదువుకోవాల్సిన వయసులో ఆ బాలికకు పెళ్లి చేశారు. అత్తారింటికి పంపించారు. భర్త వద్ద బందీగా మార్చారు. ఎలాగైనా సరే ఆ చెర నుంచి తప్పించుకోవాలనుకున్న ఆమె.. ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టింది. కానీ, ఎటు వెళ్లాలో తెలియక నడిరోడ్డులో నిల్చుండిపోయింది. ఈ సంఘటన కర్ణాటక కోలార్ జిల్లా హలేపాల్యా గ్రామంలో జరిగింది.
వారం క్రితమే..
సదరు బాలికకు ఓ వ్యక్తితో వారం క్రితమే పెళ్లి జరిపించారు ఆమె తల్లిదండ్రులు. ఈ వివాహం ఏ మాత్రం నచ్చని ఆ బాలిక.. గురువారం రాత్రి ఇంటి నుంచి బయటకు వెళ్లింది. జాతీయ రహదారి 75పై నంగోలీ వద్ద ఒంటరిగా నిల్చున్న ఆ బాలికను స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు సందేశ్కు తెలియజేశారు.
సందేశ్ ఆ ప్రాంతానికి చేరుకుని.. ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆమెను మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారుల వద్దకు పంపించారు. తన తల్లిదండ్రులు తనకు బలవంతంగా పెళ్లి చేసినందునే.. ఇంటి నుంచి బయటకు వచ్చానని అధికారుల ముందు వాపోయిందా బాలిక. చిన్నవయసులో వివాహం చేసినందుకు ఆమె తల్లిదండ్రులపై చర్యలు తీసుకోనున్నారు అధికారులు.
ఇదీ చూడండి: అక్కాచెల్లెళ్ల ఘనత- ఒకేసారి ముగ్గురికి ప్రభుత్వ ఉద్యోగం
ఇదీ చూడండి: మోదీ డిబ్బీ.. రూ.లక్ష దాయొచ్చట!