కర్ణాటకలో ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలు అందిస్తున్న ఆటో రిక్షా సర్వీసులను బుధవారం నుంచి నిలిపివేయాలని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించింది. ఆన్లైన్ బుకింగ్స్ను సైతం నిషేధిస్తున్నట్లు పేర్కొంది. రోడ్డు రవాణ సంస్థతో పాటు రోడ్డు భద్రత విభాగంతో మంగళవారం జరిపిన సమావేశంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వం తదుపరి ఆదేశాలు జారీ చేసేంతవరకు ఈ సంస్థలు ప్రజలకు ఎటువంటి సేవలను కల్పించేందుకు అనుమతి లేదని రాష్ట్ర రవాణ సంస్థ కమిషనర్ పేర్కొన్నారు.
కర్ణాటక ఆన్-డిమాండ్ రవాణా టెక్నాలజీ ఆగ్రిగేటర్స్ రూల్(కొట్టార్-2016) చట్టం ప్రకారం క్యాబ్ సంస్థలు ఆటో రిక్షా సర్వీసులు అందించేందుకు అవకాశం లేదని రవాణా కమిషనర్ తెలిపారు. ఆటో రిక్షా సేవలు నిలిపివేసేలా సైబర్ డివిజన్కు లేఖ రాస్తామని చెప్పారు. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే రూ.5వేల జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. అయితే, సాధారణ ఆటో రిక్షావాలాలపై ఎలాంటి చర్యలు తీసుకోమని, క్యాబ్ సంస్థలకే ఈ నిబంధన వర్తిస్తుందని వివరించారు. ఆటోరిక్షా సేవలను తిరిగి ప్రారంభించేందుకు టాక్సీ అగ్రిగేటర్లు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని , అయితే ప్రభుత్వం స్పష్టతనిచ్చేంత వరకు, వారి మొబైల్ అప్లికేషన్లలో ఆటోరిక్షాలను బుకింగ్ సేవలను నిలిపివేయాలని స్పష్టం చేశారు.
అక్టోబర్ 6న కర్ణాటక రవాణా శాఖ ఓలా, ఉబర్తో పాటు రాపిడోలకు కర్ణాటక సర్కారు నోటీసులు జారీ చేసింది. క్యాబ్ సంస్థలు ఆటో రిక్షా సేవలు అందించడం 'చట్టవిరుద్ధం' అని పేర్కొంది. ఆటోరిక్షా సర్వీసులను ఆపేయాలని ఆదేశిస్తూ ఆదేశాలను జారీ చేసింది. కస్టమర్ల నుంచి కంపెనీలు అధికంగా వసూలు చేస్తున్నాయని ప్రభుత్వం తెలిపింది.
ఇదీ చదవండి: ఆధార్ తీసుకుని పదేళ్లు దాటిందా? వెంటనే ఈ పని చేయండి!
'జోడు కత్తులు, డాలు'.. ఏక్నాథ్ శిందే పార్టీ గుర్తు ఖరారు చేసిన ఈసీ