Dharwad SDM College Covid News: కర్ణాటక ధార్వాడ్లోని ఎస్డీఎమ్ వైద్య కళాశాలలో కొవిడ్-19 బారిన పడిన విద్యార్థుల సంఖ్య 281కు చేరింది. కొత్తగా 99 మందికి వైరస్ నిర్ధరణ అయినట్లు ధార్వాడ్ జిల్లా కలెక్టర్ నితీశ్ పాటిల్ తెలిపారు. ఇంకా 1,822 శాంపిల్స్ ఫలితాలు రావాల్సి ఉందన్నారు.
కరోనా నిర్ధరణ అయిన 281 మందిలో కేవలం ఆరుగురిలో మాత్రమే కొవిడ్ లక్షణాలు కనిపించాయని, మిగతా వారికి ఎలాంటి లక్షణాలు లేవన్నారు. అయితే వీరందరూ పూర్తిగా టీకాలు వేసుకున్న వారేనని వివరించారు. విద్యార్థులందరినీ క్వారంటైన్కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు.
ఫ్రెషర్స్ పార్టీతోనే..
కాలేజీలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్ కె. పాటిల్ ఇదివరకే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారు.
విద్యార్థుల శాంపిల్స్ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. ఇప్పటికే క్యాంపస్లోని రెండు హాస్టళ్లను శానిటైజ్ చేశారు అధికారులు.
Covid-19 karnataka: మరోవైపు కర్ణాటకలో కొత్తగా 402 కేసులు వెలుగుచూశాయి. మహమ్మారి ధాటికి మరో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 6,611 యాక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.
ఇదీ చూడండి: ఆ పాఠశాలలో 33మంది విద్యార్థులు, టీచర్కు కరోనా