Kangana Ranaut 2024 Lok Sabha Elections : 2024 లోక్సభ ఎన్నికల్లో చండీగఢ్ స్థానం నుంచి బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ పోటీ చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. బీజేపీ తరఫున ఆమె రంగంలోకి దిగనున్నట్లు పలు వార్తాసంస్థలు కథనాలు ప్రచురించాయి. అయితే అవన్నీ నిజం కాదని కంగనా క్లారిటీ ఇచ్చారు.
చండీగఢ్ లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి కిరణ్ ఖేర్ రెండు సార్లు ఎంపీగా గెలిచారు. అయితే కిరణ్ ఖేర్ ఎప్పుడూ ప్రజల మధ్య ఉండడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలు వినడం లేదని చెబుతున్నారు. దీంతో 2024 ఎన్నికల్లో కిరణ్ ఖేర్ను అభ్యర్థిగా నిలబెట్టకూడదన్న భావనలో బీజేపీ ఉందట.
ఆ స్థానంలో హిమాచల్ ప్రదేశ్ వాసి, బాలీవుడ్ క్వీన్ కంగనాను బరిలోకి దింపేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ విషయమై కంగనా ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించారు. ఓ వార్తా సంస్థ రాసిన ఆర్టికల్ స్క్రీన్ షాట్ను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. "నేను ఎన్నికల్లో పోటీ చేస్తున్నానంటూ వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీని గురించి నా స్నేహితులు, బంధువులు నన్ను అడుగుతున్నారు. అయితే ఇదంతా నిజం కాదు" అని కంగనా తెలిపారు.
ఇటీవలే కంగనా రనౌత్ ద్వారకాలోని శ్రీకృష్ణ ద్వారకాధీశుడి ఆలయాన్ని సందర్శించారు. ఆ సమయంలో వచ్చే లోక్సభలో మీరు పోటీ చేస్తారా అని మీడియా ప్రశ్నించింది. అందుకు సమాధానంగా శ్రీకృష్ణుడు తనను ఆశీర్వదిస్తే వచ్చే లోక్సభలో పోటీ చేస్తానని కంగనా బదులిచ్చారు. అప్పటి నుంచి ఆమె రాజకీయ అరంగేట్రంపై వార్తలు ఊపందుకున్నాయి.
ఆప్ తరఫున పరిణీతి!
మరోవైపు, చండీగఢ్ లోక్సభ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆమ్ఆద్మీ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది. ఆ పార్టీ నాయకుడు, రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్ధా భార్య పరిణీతి చోప్రాను బరిలోకి దింపేందుకు ఆప్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. అయితే చండీగఢ్ లోక్సభ స్థానంలో ఇద్దరు బాలీవుడ్ హీరోయిన్లు పోటీ పడనున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
కంగనా ద ఫైర్ బ్రాండ్ - వరుస ఫ్లాపులున్నా కొత్త సినిమాలతో సందడి