ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ కొవిడ్-19 వ్యాధిపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కరోనా వైరస్ కూడా మనలాంటి జీవేనని పేర్కొన్న ఆయన.. మనలాగే కరోనా కూడా జీవించాలనుకుంటుంది కదా అని ఎదురు ప్రశ్నించారు. తన మనుగడ కోసమే వైరస్ రూపాన్ని మారుస్తోందని చెప్పారు. దెహ్రాదూన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
"కరోనా వైరస్ కూడా మనలాంటి జీవే. మనం జీవించాలనుకున్నట్లే.. అది కూడా జీవించాలనుకుంటుంది. అందుకే దాని రూపాన్ని మారుస్తోంది. ఈ వైరస్కు జీవించే హక్కు ఉంది. ప్రజల నుంచి తప్పించుకునేందుకు వైరస్ భిన్న రూపాల్లోకి మారింది."
-త్రివేంద్ర సింగ్ రావత్, ఉత్తరాఖండ్ మాజీ సీఎం
గతంలోనూ ఆవుపై ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. 'ఆక్సిజన్ను పీల్చుకొని ఆక్సిజన్ను విడుదల చేసే ఏకైక జంతువు ఆవు మాత్రమేనని పేర్కొన్నారు. రోజూ ఆవును తాకితే శ్వాసకోశ వ్యాధులు నయం అవుతాయి. ప్రజలు ఆవును గోమాత అని పిలవడానికి కారణం ఇదే'నంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి.
ఇవీ చదవండి: నిరుపయోగంగా 'పీఎం కేర్స్' వెంటిలేటర్లు.. ఎందుకిలా?