కరోనా రెండో దశ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష వైఖరితో ఉందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. వైరస్ వ్యాప్తిని ఎదుర్కొనేందుకు కేంద్రం సంసిద్ధంగా లేదని విమర్శించారు. దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన విధివిధానాలపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వంలో జరిగిన సమావేశానికి.. రాహుల్ గాంధీ సహా పార్టీ ఉన్నత స్థాయి జనరల్ సెక్రటరీలు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లతో పాటు ప్రముఖులు హాజరయ్యారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. కేవలం కొన్ని రాష్ట్రాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని దుయ్యబట్టారు. ఏడాది కాలంగా పోరాడుతున్నా.. ప్రతిపక్షాలు ఇంకా పర్యవేక్షించాల్సి రావటం విచారకరం అన్నారు సోనియా గాంధీ.
''కరోనాపై పోరాటం జాతీయ సమస్య. అన్ని పార్టీలు కలిసి పోరాడాలి. గత ఏడాదిగా మేము సహకరిస్తూ వచ్చాం. ప్రతిపక్షాల సలహాలను వినకుండా.. కేంద్రం విమర్శలను గుప్పిస్తోంది. 25 ఏళ్ల పైనున్న వారితోపాటు, ఆరోగ్య సమస్యలున్న అందరికీ వ్యాక్సిన్ అందించాలి. కరోనా మహమ్మారిపై పోరాటానికి అవసరమైన వైద్య సామగ్రిని జీఎస్టీ నుంచి తొలగించాలి.''
- సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
కరోనా వ్యాప్తిని కట్టడి చేయడానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి సీడబ్ల్యూసీ సమావేశంలో చర్చించారు. వైరస్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై కేంద్రాన్ని ప్రశ్నించాలని తీర్మానం చేశారు. పేద ప్రజలకు సైతం వ్యాక్సిన్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: 'రైతు ఉద్యమ స్థలాల్లో టీకా కేంద్రాల ఏర్పాటు!'
ఇదీ చదవండి: దీప్ సిద్ధూకు బెయిల్ మంజూరు