కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్. మహాత్మా గాంధీ ఆలోచనలకు బదులు.. దేశాన్ని విభజించిన జిన్నా మార్గంలో రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నడుస్తోందని ఆరోపించారు. అది దేశాన్ని నాశనం చేస్తుందన్నారు.
అసోంలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీ సందర్భంగా ఈ మేరకు కాంగ్రెస్పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు చౌహాన్.
"స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచీ ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి పనులు చేయటంలో కాంగ్రెస్ విఫలమైంది. మాజీ ప్రధాని, అసోం రాజ్యసభ సభ్యుడు మన్మోహన్ సింగ్ సైతం రాష్ట్రం కోసం ఏమీ చేయలేదు. మహాత్మాగాంధీ మార్గాన్ని కాంగ్రెస్ అనుసరించటం లేదు. కాంగ్రెస్, రాహుల్ గాంధీలు.. జిన్నా అడుగుజాడల్లో నడుస్తున్నారు. అది అసోంతో పాటు దేశాన్ని నాశనం చేస్తుంది. "
- శివరాజ్ సింగ్ చౌహాన్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి
ఆల్ ఇండియా యునైటెడ్ డెమొక్రటిక్ ఫ్రంట్తో చేతులు కలపటం పట్ల కాంగ్రెస్ సిగ్గుపడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు చౌహాన్. అసోం మాజీ ముఖ్యమంత్రి తరుణ్ గొగొయి వారితో పొత్తు పెట్టుకోలేదని గుర్తు చేశారు. అసోంను చొరబాటుదారులతో నింపిన బద్రుద్దీన్ అజ్మల్తో కాంగ్రెస్ దోస్తి కట్టిందని ఆరోపించారు. 'వారికి గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మలు అవసరం లేదు కానీ, అజ్మల్ కావాలి' అని.. జీ-23 నేతలను ప్రచారానికి దూరం పెట్టటంపై పరోక్షంగా విమర్శించారు. కాంగ్రెస్ విభజించు పాలించు సూత్రాన్ని పాటిస్తోందన్నారు.
ఇదీ చూడండి: 'రాముడితో సమానంగా మోదీని చూస్తారు'