ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించకుండానే బంగాల్ శాసన సభ ఎన్నికల బరిలో నిలవాలని నిర్ణయించింది భాజపా. ఈ మేరకు భాజపా కార్యదర్శి, ఆ పార్టీ బంగాల్ బాధ్యులు కైలాస్ విజయ వర్గీయ తెలిపారు.
భాజపా అధికారంలోలేని చాలా రాష్ట్రాల్లో జరిగిన శాసన సభ ఎన్నికలల్లో తమ పార్టీ తరపున సీఎం అభ్యర్థిని ముందుగా ప్రకటించకుండానే బరిలో నిలిచాం. హరియాణా, ఉత్తర్ప్రదేశ్, అసోంలో అలాగే చేశాం. బంగాల్లో కూడా ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థి ప్రకటించకుండానే ఎన్నికల బరిలో నిలుస్తాం. ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఆధిక్యం లభించాకే పార్టీ అధిష్ఠానం, ఎమ్మెల్యేలు కలిసి సీఎం అభ్యర్థి ఎవరనేది నిర్ణయిస్తాయి.
-కైలాస్ విజయ వర్గీయ, బంగాల్ భాజపా బాధ్యులు
బంగాల్కు కాబోయే తమ పార్టీ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తారని అన్నారు వర్గీయ.
మమతా బెనర్జీ నాయత్వంపై అసంతృప్తితో ఉన్న వారందరు భాజపాలోకి వస్తున్నారు. తమ పార్టీపై నమ్మకంతో, నరేంద్రమోదీపై విశ్వాసంతో ఉన్న వారినే తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. గోవుల అక్రమ రవాణా, మనీలాండరింగ్ కేసులకు, దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారికి భాజపాలో చోటు లేదు. అలాంటి వారిని ఎట్టి పరిస్థితుల్లో పార్టీలో చేర్చుకునేది జరగదు.
-కైలాస్ విజయ వర్గీయ, బంగాల్ భాజపా బాధ్యులు
రోజురోజుకు భాజపా కార్యకర్తలపై దమనకాండ పెరిగిపోతోందని అన్నారు వర్గీయ. చాలా మంది భాజపా కార్యకర్తలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మమత సర్కార్ హింసకు మారు పేరుకగా నిలిచిందని మండిపడ్డారు. బంగాల్ను మమత అరాచకత్వంలోకి నెట్టారని దుయ్యబట్టారు.
వచ్చే శాసనసభ ఎన్నికల్లో గెలిచి రవీంద్రనాథ్ ఠాగూర్, సుభాష్ చంద్రబోస్, బంకింమ్ చంద్ర చటర్జీల బంగాల్ను మళ్లీ తీసుకొస్తామని కైలాస్ నొక్కి చెప్పారు.
పరాక్రమ్ దివస్-మోదీ రాక
నేతాజీ సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి ఉత్సవాల సందర్భంగా నిర్వహించే పరాక్రమ్ దివస్ ప్రారంభానికి ప్రధాని నరేంద్ర మోదీ.. జనవరి 23న కోల్కతాకు రానున్నారని కైలాస్ తెలిపారు. విక్టోరియా హాల్ని మ్యూజియంగా మార్చి యువతకు మోదీ అంకితమివ్వనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'బంగాల్.. ఉగ్రవాదులకు అడ్డాగా మారింది'