బంగాల్ రాష్ట్ర భాజపా కమిటీ సభ్యుడు కృష్ణేందు ముఖర్జీ కారుపై దుండగుల కాల్పులకు తెగబడ్డారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ) కార్యకర్తలే ఈ దాడి జరిపారని కృష్ణేందు ఆరోపించారు.
"కోల్కతా నుంచి ఇంటికి వస్తుండగా.. పశ్చిమ బర్ధమాన్ జిల్లాలోని అసన్సోల్లో హిరపుర వద్ద ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు కారును అడ్డగించారు. కారు డోర్లు తెరిచేందుకు యత్నించి విఫలమయ్యారు. దాంతో వాహనంపై కాల్పులు జరిపారు. వారు టీఎంసీ కార్యకర్తలే" అని కృష్ణేందు అన్నారు.
స్థానికుల సాయం కోసం డ్రైవర్ గట్టిగా హార్న్ మోగించగా అగంతుకులు పారిపోయారని తెలిపారు. ఈ దాడి వెనుక టీఎంసీ నేతలే ఉన్నట్లు ఆరోపించిన ఆయన.. ఘటన గురించి సీనియర్ అధికారులకు తెలియజేసినట్లు చెప్పారు.
పాత శత్రువులే దాడికి కారణం!
కృష్ణేందు ఆరోపణలను స్థానిక టీఎంసీ ఎమ్మెల్యే తపస్ బెనర్జీ ఖండించారు. 'ఆయనపై గతంలో దోపిడీ, స్మగ్లింగ్ సహా హత్యారోపణ కేసులున్నాయి. పాత శత్రువులే ఈ దాడి చేసి ఉంటారు' అని అన్నారు బెనర్జీ.
కృష్ణేందు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. స్థానిక సీసీ కెమెరాలో రికార్డు అయిన దృశ్యాలను పరిశీలించి, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: టీకా కోసం ఈ వారమే భారత్ బయోటెక్తో ఒప్పందం