కరోనా మహమ్మారి సమయంలో ఎవరైనా అనారోగ్యంతో ప్రాణాలు కోల్పోతే.. వారి అంత్యక్రియలకు కనీసం దగ్గరి బంధువులు కూడా వెళ్లలేని పరిస్థితులు తలెత్తాయి. అయితే.. మేమున్నామంటూ ఓ వృద్ధురాలి అంత్యక్రియల్లో పాల్గొన్నాయి వానరాలు. దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులను కోతులు ఓదార్చాయి. హృదయాల్ని హత్తుకునే సంఘటన ఉత్తర్ప్రదేశ్లో జరిగింది. ప్రస్తుతం ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
ఉత్తర్ప్రదేశ్ ప్రతాప్గఢ్ జిల్లా లాల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్హా గ్రామంలో ఓ వృద్ధురాలు మరణించింది. కుటుంబ సభ్యులు, బంధువులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఆ సమయంలో కొన్ని కోతులు అక్కడికి చేరుకున్నాయి. కొన్ని వానరాలు మృతదేహం చుట్టూ కూర్చోవటం, ఓ వానరం ఏకంగా మృతదేహం ఉన్న మంచంపై కూర్చుని కొంత సమయం పాటు అక్కడే ఉంది. దుఃఖంలో ఉన్నవారిని వానరాలు ఓదార్చుతున్నట్లు కనిపించింది.
సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ఈ వింతను చూసేందుకు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఇలాంటి సంఘటన తమ గ్రామంలో గతంలో ఎన్నడూ జరగలేదని.. ఇది దేవుడి లీలగా పేర్కొన్నారు. వృద్ధురాలి మృతదేహం చుట్టూ సుమారు రెండు గంటల పాటు కూర్చుని ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు.
ఇదీ చూడండి: ఊరంతా విలుకాళ్లే.. గురి అంతా లక్ష్యంపైనే!