కరోనాపై పోరాటంలో ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి హర్షవర్ధన్. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కొవిడ్-19 పరీక్షల కోసం రక్త నమూనాల సేకరణ, పరీక్షలు చేసే ప్రణాళికలపై చర్చించారు. ల్యాబ్లకు అవసరమైన పరీక్ష కిట్లను వేగంగా సమకూర్చాలని సూచించారు. ఐసీఎంఆర్, బయో టెక్నాలజీ, సీఎస్ఐఆర్, సైన్స్ అండ్ టెక్నాలజీ అధికారులు ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
రాష్ట్రాలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించాలని సూచించారు ఆరోగ్యమంత్రి. టెస్టింగ్ కిట్లకు, వైద్య సామగ్రికి కొరత లేకుండా చూడాలని ఆదేశించారు. ల్యాబ్లు, టెస్టింగ్ సౌకర్యాలు లేని ఈశాన్య రాష్ట్రాలు, లద్దాఖ్ వంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనపు సహకారం అందిస్తామని చెప్పారు.
నాణ్యత విషయంలో రాజీ లేదు..
ప్రభుత్వ, ప్రైవేటు పరీక్షా కేంద్రాల్లో అందుబాటులో ఉంచే కిట్ల నాణ్యతలో ఎలాంటి రాజీ పడబోమని ఉద్ఘాటించారు మంత్రి. నాణ్యతను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటామని చెప్పారు. భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్) నిబంధనలకు అనుగుణంగానే టెస్టింగ్ కిట్లు ఉండి తీరాలని స్పష్టంచేశారు హర్షవర్ధన్.
అందుబాటులో ల్యాబ్లు..
ప్రస్తుతం దేశంలో 129 ప్రభుత్వ పరీక్షా కేంద్రాలు ఉన్నాయని, వీటిద్వారా రోజూ 13,000 వేల వైరస్ పరీక్షలు నిర్వహించవచ్చని ఐసీఎంఆర్ అధికారులు మంత్రికి నివేదించారు. మరో 49 ప్రైవేటు ల్యాబ్లకు వైరస్ పరీక్షలు నిర్వహించేందుకు అనుమతించామని చెప్పారు. 16,000 వేల ప్రైవేటు కేంద్రాల ద్వారా రక్త నమూనాలను సేకరిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చూడండి: మందు బాబులకు లిక్కర్ పాసులు- ప్రభుత్వం సంచలన నిర్ణయం