ఆర్మీ కమాండర్స్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు సైన్యాధికారులు. స్వదేశీ, విదేశీ తయారీ రక్షణ ఉత్పత్తులు, డ్రోన్లను పరిశీలించారు. నిన్న జరిగిన ఈ సమావేశంలో సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ కూడా పాల్గొన్నారు.
పంజాబ్లోకి ఆయుధాలు, మాదకద్రవ్యాలను అక్రమంగా రవాణా చేయడానికి పాకిస్థాన్ డ్రోన్లను వినియోగిస్తోంది. వీటిని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమకూర్చుకోవాలని సైన్యం నిర్ణయించింది. ఇందుకోసం దేశ, విదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన పలు కౌంటర్ డ్రోన్లను బిపిన్ రావత్, కమాండర్స్ పరిశీలించారు.
ఇజ్రాయెల్ డ్రోన్లు
అత్యంత ఎత్తైన ప్రదేశాలకు చేరుకోగలిగే సామర్థ్యం గల, శత్రు లక్ష్యాలను శోధించి, గుర్తించి, నాశనం చేయగల ఇజ్రాయెల్ తయారీ డ్రోన్లనూ అధికారులు పరిశీలించారు.
పాక్ దుస్సాహసం
గతవారం పంజాబ్లోని ఫిరోజ్పుర్లోకి ఓ పాకిస్థానీ డ్రోన్ ప్రవేశించింది. ఈ పరిణామంతో సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), పోలీసులు అప్రమత్తమయ్యారు. అక్టోబర్ 8, 9 తేదీల్లో పాక్ డ్రోన్లు హజారాసింగ్ వాలా, టెండివాలా గ్రామాల్లోకి ప్రవేశించాయి. ఈ విషయంపై మంగళవారం పాకిస్థాన్ రేంజర్స్తో జరిగిన ఫ్లాగ్ మీటింగ్లో బీఎస్ఎఫ్ నిరసన వ్యక్తం చేసింది.
కొద్ది రోజుల క్రితం 2 పాక్ డ్రోన్లను పంజాబ్ పోలీసులు పట్టుకున్నారు. ఇవి జీపీఎస్తో పనిచేస్తూ భూమికి 500 మీటర్ల ఎత్తులో ఎగురుతూ వచ్చాయి. వీటి ద్వారా అక్రమంగా రవాణా చేస్తున్న ఏకే-47 రైఫిల్స్, పిస్టల్స్, హ్యాండ్ గ్రనేడ్లు, శాటిలైట్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి: నోట్లరద్దు, జీఎస్టీ కారణంగానే నిరుద్యోగం: రాహుల్