వలసకార్మికులు పడుతున్న తీవ్రమైన బాధలను దేశం మొత్తం చూస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విచారం వ్యక్తం చేశారు. వారి కష్టం ఇంకా ప్రభుత్వం దృష్టికి చేరినట్లు లేదని విమర్శించారు. వలస కార్మికుల సమస్యలపై గరువారం కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన వీడియో సందేశంలో సోనియా మాట్లాడారు.
" వలస కార్మికుల బాధను అందరూ చూశారు. వారు ఏడుపులు విన్నారు. కానీ ప్రభుత్వం అవన్నీ ఇంకా చూసినట్లు లేదు. రానున్న ఆరు నెలల కాలానికి ప్రతి పేద కుటుంబానికి కేంద్రం రూ.7,500 అందించి ఆదుకోవాలి. అలాగే ఇళ్లకు చేరుకోడానికి సురక్షితమైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలి’ అని కోరారు. లాక్డౌన్లో పేదలు, వలస కార్మికులు, చిరువ్యాపారులు, మధ్యతరగతి వర్గాలు ఎదుర్కొంటున్న కష్టాలను 'స్పీక్అప్' క్యాంపైన్ ద్వారా పార్టీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తోంది. ఈ వీడియో కూడా దానిలో భాగమే."
- సోనియాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు.
వలస కార్మికులకు ఆహారం, షెల్టర్ కల్పించాలని, రవాణా ఏర్పాట్లు చేయాలని ఆదేశిస్తూ సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం నోటీసులు జారీ చేసింది. కరోనా కట్టడి కోసం కేంద్రం విధించిన లాక్డౌన్ వలస కార్మకులకు పెను శాపంగా మారింది. నగరాల్లో ఉపాధి కోల్పోయి, తిండి, నిలువ నీడ లేక అగచాట్లు పడుతున్నారు. కొందరు నానా తంటాలు పడి ఇంటికి చేరుకుంటున్నారు. వారి తరలింపునకు ప్రభుత్వాలు రైళ్లు, బస్సులు ఏర్పాటు చేసినా పరిస్థితిలో మార్పులేదు.