కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను రాజకీయంగా అంతం చేయటానికి ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
మండ్య లోక్సభ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వ భాగస్వామి కాంగ్రెస్పై ఆధారపడబోనని కుమారస్వామి స్పష్టం చేశారు. జేడీ(ఎస్) ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రస్తుత ఎంపీ ఎల్ ఆర్ శివరామె గౌడలనే నమ్ముకున్నానని ఆయన అన్నారు. నేనెవరినీ (కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి) విమర్శించబోనని కుమారస్వామి అన్నారు.
"మండ్యలో కొంత మంది కాంగ్రెస్ నేతలు నిఖిల్ గెలుపుకోసం పనిచేస్తున్నారు. మరికొందరు పనిచేయడం లేదు. ఇందుకు నేనేమీ నిరాశ చెందడం లేదు. నిఖిల్ని ఓడించి నా రాజకీయ జీవితాన్ని నాశనం చేయాలని ఓ వర్గం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే వారికి స్థానిక ప్రజల మద్దతు లేదు." -కుమారస్వామి, కర్ణాటక ముఖ్యమంత్రి
మండ్యలో జేడీ (ఎస్) పార్టీకి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని కుమారస్వామి ఆశాభావం వ్యక్తం చేశారు.
పొరపొచ్చాలు...
కర్ణాటకలో జేడీ(ఎస్), కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం నడుస్తోంది. ఇటీవల కాలంలో ఈ రెండు పార్టీల మధ్య పొరపొచ్చాలు తరచూ బయటపడుతూనే ఉన్నాయి.
3 రోజుల క్రితం కొంతమంది జేడీ (ఎస్) కార్యకర్తలు మైసూర్ ఎంపీ స్థానానికి పోటీచేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి సీహెచ్ విజయ్శేఖర్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఉన్నత విద్యాశాఖ మంత్రి జీటీ దేవెగౌడ సమక్షంలోనే భాజపా అనుకూల నినాదాలు చేశారు. ఈ ఘటనలు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశముంది.
గట్టి పోటీనే...
మండ్య లోక్సభ స్థానం నుంచి నిఖిల్ కుమారస్వామి, హసన్లో ప్రజ్వల్ రేవణ్ణ పోటీపడుతున్నారు. వీరికి ఆయా స్థానాల్లో కాంగ్రెస్ కార్యకర్తల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
మండ్యలో నిఖిల్కు పోటీగా దివంగత నేత అంబరీష్ భార్య, నటి సుమలత బరిలో నిలిచారు. ప్రభుత్వం మండ్యలో అల్లర్లు సృష్టిస్తోందని సుమలత ఆరోపిస్తున్నారు. జేడీ (ఎస్) నేతలు తనను ఓడించడానికి సుమలత పేరు గల మరో ముగ్గురు మహిళలను మండ్యలో పోటీకి నిలిపారని ఆమె దుయ్యబట్టారు. దీనిపై స్పందించిన సీఎం కుమారస్వామి, ఎన్నికల్లో పోటీచేయకుండా ఎవరినైనా నేనెలా ఆపగలనని ప్రశ్నించారు.
సుమలతకు భాజపాతో పాటు కొంత మంది కాంగ్రెస్ నేతల మద్దతుంది. నిఖిల్ కుమారస్వామికి గట్టిపోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.