రవీంద్రనాథ్ ఠాగూర్ మార్గనిర్దేశనంలో విశ్వభారతి విశ్వవిద్యాలయం భారత స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ జాతీయవాదానికి ఈ విద్యాలయం ముఖచిత్రంగా నిలిచిందని పేర్కొన్నారు.
శాంతినికేతన్లోని విశ్వభారతి యూనివర్సిటీ శతాబ్ది ఉత్సవాలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు మోదీ. భారత్లోని ఆధ్యాత్మికత వల్ల మానవజాతి మొత్తం ప్రయోజనం పొందాలని ఠాగూర్ కోరుకున్నారని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితోనే ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
"విశ్వభారతి నుంచి ఉద్భవించిన సందేశాన్ని మన దేశం ప్రపంచానికి తెలియజేస్తోంది. యూనివర్సిటీ వందేళ్ల ప్రయాణం చాలా ప్రత్యేకమైనది. గురుదేవ్(రవీంద్రనాథ్ ఠాగూర్) చింతన, దూరదృష్టి, కఠోర శ్రమకు ప్రతిరూపమే ఈ విశ్వభారతి."
-ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
భారత్లో స్వాతంత్రోద్యమాలు అంటే 19, 20వ శతాబ్దాలే గుర్తుకు వస్తాయని.. కానీ, అంతకు చాలా ముందే ఈ ఉద్యమాలకు బీజం పడిందని మోదీ పేర్కొన్నారు. శతాబ్దాలుగా కొనసాగిన ఆ ఉద్యమాల నుంచి లభించిన స్ఫూర్తి.. స్వాతంత్ర సంగ్రామానికి దోహదం చేసిందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా భక్తి ఉద్యమాన్ని ఉదహరించారు.
పారిస్ లక్ష్యాల దిశగా..
పారిస్ ఒప్పంద లక్ష్యాలను చేరుకొనేందుకు ఒక్క భారత్ మాత్రమే సరైన దిశగా పయనిస్తోందని మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ సౌర కూటమి ద్వారా పర్యావరణ పరిరక్షణకు భారత్ నేతృత్వం వహిస్తోందని చెప్పారు.