కొవిడ్ మహమ్మారి నుంచి రక్షణ కల్పించేందుకు సరికొత్త టీషర్టులు, ఔషధ ద్రావణాన్ని మన దేశానికి చెందిన రెండు అంకుర సంస్థలు అభివృద్ధి చేశాయి. ఇ-టెక్స్, క్లెన్స్టా అనేవి ఐఐటీ దిల్లీలో పురుడు పోసుకున్న రెండు అంకుర సంస్థలు. 'ఇ-టెక్స్ 'యాంటీవైరల్ ఫాబ్రిక్తో తాజాగా టీ-షర్టులను తయారు చేసింది. వాటి ఉపరితలాన్ని తాకితే కరోనా వైరస్ సహా ఏ సూక్ష్మజీవులైనా సరే అంతమవుతాయి. 30సార్లు ఉతికిన తరువాత కూడా యాంటీ వైరల్ సామర్థ్యాన్ని కోల్పోకపోవటం ఈ టీషర్టుల ప్రత్యేకత. వాటిపై ఉండే రసాయనం మానవులకు, ప్రకృతికి ఏమాత్రం హానికరం కాదని నిపుణులు తేల్చారు.
మరోవైపు తాము రూపొందించిన ఔషధ ద్రావణం 99.9శాతం వరకు సూక్ష్మక్రిములను నాశనం చేయగలదని క్లెన్స్టా సంస్థ తెలిపింది. ఒక్కసారి పూసుకుంటే 24గంటలవరకు అది ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది. ఇ-టెక్స్ టీషర్టులు, క్లెన్స్టా ద్రావణంతో కూడిన కిట్లను ఐఐటీ దిల్లీ డైరెక్టర్ వి. రామ్గోపాల్రావు శుక్రవారం ఆవిష్కరించారు.