రైలు ప్రమాదంలో చేతులను కోల్పోయిన మోనికా మోరే అనే యువతికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించిన ముంబయి వైద్యులు.. బాధితురాలిని డిశ్చార్జి చేశారు.
2014లో జరిగిన రైలు ప్రమాదంలో తన రెండు చేతులను కోల్పోయింది మోనిక. ఆ ప్రమాదం తర్వాత కృత్రిమ చేతులను అమర్చారు వైద్యులు. అనంతరం బ్రెయిన్ డెడ్ అయిన ఓ వ్యక్తి చేతులను చెన్నై నుంచి ముంబయికి తీసుకొచ్చి యువతికి అమర్చారు. నెల రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచిన తర్వాత శనివారం డిశ్చార్జి చేశారు.
శస్త్రచికిత్స తర్వాత యువతి తనకు తానుగా చిన్నచిన్న పనులు చేసుకోగలుగుతుందని వైద్యులు తెలిపారు. సర్జరీ తర్వాత ఇలాంటి బాధితులు పదుల సంఖ్యలో ఆస్పత్రిని సందర్శించినట్లు చెప్పారు.
తనకు వైద్యం చేసిన డాక్టర్లకు మోనిక కృతజ్ఞతలు తెలిపింది. చికిత్సతో పాటు మానసికంగా దృఢంగా ఉండేందుకు ఎంతో సహాయం చేశారని పేర్కొంది.