సీనియర్ శాస్త్రవేత్త హేమంత్ కుమార్ పాండే రెండోసారి డీఆర్డీఓ'సైంటిస్ట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు' గ్రహీతగా నిలిచారు. ల్యూకోడెర్మా చికిత్స కోసం తయారు చేసిన ప్రసిద్ధ ఔషధమైన లుకోస్కిన్తో సహా వివిధ మూలికా ఔషధాలను అభివృద్ధి చేయడంలో ఆయన చేసిన కృషికి గానూ ఈ అవార్డు దక్కింది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో హేమంత్కు ప్రతిష్ఠాత్మక అవార్డుతో పాటు ధ్రువపత్రం, రూ.2 లక్షల నగదు బహుమతిని అందించారు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్.
హేమంత్ కుమార్.. ఇప్పటివరకు ఆరు మూలికా ఔషధాలను అభివృద్ధి చేశారు. తాజాగా మూలికలతో అభివృద్ధి చేసిన ఈ ఔషధాన్ని దిల్లీలోని అమిల్ ఫార్మాస్యూటికల్స్ 'లుకోస్కిన్' పేరుతో యాంటీ-ల్యూకోడెర్మా ఉత్పత్తిని మార్కెట్లోకి విడుదల చేసింది. చర్మంపై తెల్ల మచ్చలు నివారించడానికి లుకోస్కిన్ను ఉపయోగిస్తారు. ఈ ఔషధం మార్కెట్లో విస్తృతంగా ప్రసిద్ధి చెందింది.
మూలికా వైద్య రంగంలో ఆయన చేసిన కృషికి పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలను అందుకున్న పాండే.. 2018లోనూ ఈ అవార్డు అందుకున్నారు. గత 25 ఏళ్లుగా ఉత్తరాఖండ్లోని పిథోరాగఢ్లోని డీఆర్డిఓకి చెందిన ల్యాబ్ డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బయో ఎనర్జీ రీసెర్చ్ (డీబీఈఆర్)లో పరిశోధనలు చేస్తున్నారు హేమంత్.
ఇదీ చూడండి: 'గగన్యాన్ ప్రయోగం కోసం హరిత ఇంధనం అభివృద్ధి'