జమ్ముకశ్మీర్లో సాధారణ పరిస్థితులే ఉన్నాయని స్పష్టంచేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఆర్టికల్ 370 రద్దు అనంతర స్థితిగతులపై రాజ్యసభలో అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు హోంమంత్రి.
ఆగస్టు 5 తర్వాత ఒక్క వ్యక్తి కూడా పోలీసు కాల్పుల్లో మృతి చెందలేదని, రాళ్లదాడులు వంటి ఘటనలు గతేడాదితో పోల్చితే తగ్గాయని చెప్పారు. పూర్తిస్థాయిలో పాఠశాలలు తెరుచుకున్నాయని, విద్యార్థుల హాజరు శాతం ఎక్కువగా ఉందన్నారు షా.
కశ్మీర్లో అన్ని వార్తాపత్రికలు, టీవీ ఛానళ్లు పని చేస్తున్నాయని స్పష్టంచేశారు షా. ఆర్టికల్ 370 రద్దు తర్వాత పత్రికల సర్క్యులేషన్ తగ్గలేదని చెప్పారు.
రాత్రిపూటే ఆంక్షలు..
144 సెక్షన్ను ఇప్పటికే ఎత్తేశామని, రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు భద్రతా కారణాల రీత్యా నిషేధాజ్ఞలు కొనసాగుతున్నాయని వివరించారు అమిత్ షా.
అంతర్జాల నిలిపివేత అందుకే...
దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని.. కశ్మీర్లోని ఉన్నతాధాకారుల అభిప్రాయం తీసుకున్న అనంతరమే అంతర్జాల సేవలు పునః ప్రారంభిస్తామన్నారు షా. ఇప్పటికే ల్యాండ్లైన్ ఫోన్లు ఏర్పాటు చేశామని గుర్తుచేశారు.
అందుబాటులో వైద్యం..
కశ్మీర్లో వైద్యానికి సంబంధించి అన్ని రకాల సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు అమిత్ షా. మొబైల్ ఆసుపత్రులను ఏర్పాటు చేశామని చెప్పారు.
"జమ్ముకశ్మీర్లో 144 సెక్షన్ అమలులో లేదు. పూర్తిస్థాయిలో ఎత్తేశాం. రాత్రి 8 నుంచి 6 గంటల వరకు ఆంక్షలను అమలు చేస్తున్నాం. అంతర్జాల సేవలను పునఃప్రారంభించే అంశంలో స్థానిక అధికారుల అభిప్రాయం మేరకే నిర్ణయం తీసుకుంటాం. కశ్మీర్లో దాయాది దేశ ప్రోద్బలంతో పలు చట్టవ్యతిరేక కార్యక్రమాలు జరుగుతుంటాయని మనందరికీ తెలుసు. ఆ ప్రాంత పరిస్థితులను, భద్రతను పరిగణనలోకి తీసుకునే ఈ నిర్ణయం తీసుకున్నాం. వైద్యసేవలు, మందులు అందుబాటులో ఉన్నాయి. ఎక్కడా ఏ సమస్యా లేదు. సంచార ఔషధ దుకాణాలు ఏర్పాటు చేశాం."
-అమిత్షా, కేంద్ర హోంమంత్రి
ఇదీ చూడండి: 'చిదంబరానికి బెయిల్'పై ఈడీకి సుప్రీం తాఖీదులు