భారత్లో ఒక్క రోజులో రికార్డు స్థాయిలో కరోనా టెస్టులు నిర్వహించారు. 4.20 లక్షల మందికి కొవిడ్ నిర్ధరణ పరీక్షలు చేసినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. దేశంలో క్రమంగా కొవిడ్-19 టెస్టుల సామర్థ్యం పెంచుతున్నట్లు స్పష్టం చేసింది.
"2020 జనవరి నాటికి భారత్లో కరోనా నిర్ధరణ పరీక్షలు చేసే ల్యాబ్ ఒక్కటి మాత్రమే ఉంది. కానీ ఇప్పుడు ప్రభుత్వ, ప్రైవేట్ ల్యాబ్లు కలిపి దేశంలో 1,301 కొవిడ్ టెస్ట్ ల్యాబ్లు ఉన్నాయి. ఐసీఎంఆర్ సవరించిన మార్గదర్శకాలు, రాష్ట్రప్రభుత్వాల కృషి ఇందుకు దోహదం చేశాయి."
- కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ
టెస్టింగ్ సామర్థ్యం పెరుగుతోంది..
"కరోనా సంక్షోభం మొదలైనప్పటి నుంచి జులై 24 వరకు వరకు దేశవ్యాప్తంగా మొత్తం 1కోటి 58 లక్షల 49 వేల అరవై ఎనిమిది కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. కేవలం గత వారంలోనే ప్రతిరోజు 3.50 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించాం. అంతేకాదు గత 24 గంటల్లో 4,20,898 కరోనా టెస్టులు చేశాం. అంటే ప్రతి 10 లక్షల జనాభాలో 11,485 కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించే స్థితికి చేరుకున్నాం" అని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది.
ఈ వ్యూహాన్ని పాటించండి...
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు... 'టెస్ట్, ట్రాక్, ట్రీట్' వ్యూహంతో ముమ్మరంగా కొవిడ్ నిర్ధరణ పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సూచించింది. ఫలితంగా కరోనా వైరస్ వ్యాప్తిని మరింత సమర్థవంతంగా నియంత్రించవచ్చని ఆభిప్రాయపడింది.
మరణాల రేటు తగ్గింది..
దేశంలో కరోనా పరీక్షలు పెంచిన నేపథ్యంలో... కొవిడ్ మరణాలు గణనీయంగా 2.35 శాతం మేర తగ్గాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ మరణాల రేటుగా స్పష్టం చేసింది. అలాగే వ్యాధి నుంచి కోలుకున్నవారి శాతం కూడా 63.54కి పెరిగిందని వెల్లడించింది. ఇప్పటి వరకు 8,49,431 మంది వ్యాధి నుంచి కోలుకున్నారని స్పష్టం చేసింది.
ఉద్ధృతి కొనసాగుతోంది..
భారత్లో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. దేశంలో కొత్తగా 48,916 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీనితో మొత్తం కేసుల సంఖ్య 13 లక్షలు దాటింది. అలాగే మొత్తం మరణాల సంఖ్య 31,358కి చేరింది.
ఇదీ చూడండి: దక్షిణ భారతంలో ఐసిస్ ఉగ్రవాదుల అలికిడి