జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను అమర్నాథ్ యాత్ర పూర్తయిన తరువాతనే ప్రకటిస్తామని ఈసీ మంగళవారం స్పష్టం చేసింది. ఈ ఏడాది జమ్ముకశ్మీర్లో ఆలస్యంగా ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల నిర్వహణ ప్యానల్ ఏకగ్రీవంగా నిర్ణయించిందని ఈసీ తెలిపింది.
జమ్ముకశ్మీర్లో పరిస్థితులను ఎన్నికల సంఘం నిరంతరం పర్యవేక్షిస్తుందని వెల్లడించింది. వచ్చే నెలలో ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్ర ముగిసిన తరువాతే, రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటిస్తామని తెలిపింది. సాధారణంగా అమర్నాథ్ యాత్ర మాస శివరాత్రి జూలై 1 నుంచి ఆగష్టు 15 శరవణ పూర్ణిమ వరకు కొనసాగుతుంది.
ఎన్నికైన ప్రభుత్వం లేదు
జమ్ముకశ్మీర్లో 2018 జూన్లో పీడీపీ- బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కూలిన నాటి నుంచి అక్కడ ఎన్నికైన ప్రభుత్వం లేదు. అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో గవర్నర్ పాలన కొనసాగుతోంది. రాజ్యాంగ సవరణ ప్రకారం 2018 డిసెంబర్ 19 నుంచి ఆ రాష్ట్రం రాష్ట్రపతి పాలన కిందకు వచ్చింది. దీన్ని తాజాగా మరికొంత కాలం పొడిగించే అవకాశముంది.
లోక్సభతో పాటే నిర్వహించలేం..
ఏప్రిల్ నెలలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధుల బృందం సీఈసీని కలిసి, అమర్నాథ్ యాత్ర జరిగే సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని తెలిపింది. లోక్సభ ఎన్నికలు జరిగినపుడు, అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించలేమని ఈసీ అభిప్రాయపడింది. జమ్ముకశ్మీర్లో ఎన్నికల నిర్వహణకు తాజా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆదేశించింది.
ఏప్రిల్లో జరిగిన సమావేశంలో ముగ్గురు ప్రత్యేక పర్యవేక్షకులను నియమించింది ఈసీ. లోక్సభ ఎన్నికల తర్వాత అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.
మార్చి 10న లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించిన సందర్భంలో అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించొద్దని ఈసీ నిర్ణయించింది.
ఇదీ చూడండి: విద్యావ్యవస్థను క్రమబద్ధీకరించండి: సుప్రీం