మరికొద్ది రోజుల్లో కరోనా టీకా అందుబాటులోకి రానుంది. ఈ తరుణంలో టీకా పంపిణీకి అధికారుల సన్నద్ధతను పరిశీలించేందుకు వ్యాక్సిన్ డ్రై రన్ను నిర్వహిస్తోంది కేంద్రం. గుజరాత్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, అసోం రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించింది. రెండు రోజుల పాటు మాక్ డ్రిల్ జరగనుంది.
పంజాబ్ లుథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజ్లో డ్రై రన్ నిర్వహిస్తున్నారు. గుజరాత్లోని రాజ్కోట్, గాంధీనగర్ జిల్లాల్లో ఈ మాక్డ్రిల్ నిర్వహిస్తున్నారు. సోమవారం డ్రై రన్లో పాల్గొనేవారి వివరాలు నమోదు చేసి కో-విన్ యాప్లో అప్లోడ్ చేసే ప్రక్రియ మాత్రమే జరుగుతుందని, మంగళవారం 125 మంది లబ్ధిదారులు డ్రై రన్లో పాల్గొంటారని గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ వైద్యాధికారి డా.కల్పేష్ గోస్వామి తెలిపారు. క్షేత్రస్థాయిలో అధికారుల పరిశీలన కూడా మంగళవారమే ఉంటుందని పేర్కొన్నారు.
డ్రై రన్లో భాగంగా టీకా పంపిణీకి కేంద్రం ఉపయోగించబోయే కో-విన్ యాప్ పనితీరును పరిశీలిస్తున్నారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక ప్రజలకు పంపిణీ చేసే సమయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలను గుర్తించి పరిష్కరించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది.
కరోనా టీకా అత్యవసర వినియోగానికి సీరం, భారత్ బయోటెక్, ఫైజర్ సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. అయితే సీరం సంస్థ అభివృద్ధి చేస్తున్న కొవిషీల్డ్ టీకాకు ఈ వారంలో అనుమతులు లభించే అవకాశాలున్నాయి. భారత్ బయోటెక్ టీకా ఇంకా మూడో దశ క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేయాల్సి ఉన్నందున అనుమతికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఫైజర్ టీకా తుది ఫలితాలకు సంబంధించి కేంద్రం మరింత సమాచారం కోరింది. దీంతో ఆ సంస్థ కేంద్రాన్ని గడువు కోరింది.