బిహార్లో వికాస్ పురుష్గా, క్లీన్ ఇమేజ్ ఉన్న నేతగా ప్రజల్లో మంచి పేరున్న నేత నితీశ్కుమార్. ఇప్పటికే ఆరుసార్లు సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆయన.. మరోసారి తనకు ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు. బిహార్ను అభివృద్ధి బాట పట్టించిన నితీశ్కు ఈ ఎన్నికలు నల్లేరుమీద నడకేలా ఏమీ కనబడటంలేదు. గతంతో పాలకులతో పోలిస్తే రాష్ట్రంలో నితీశ్ అభివృద్ధి వెలుగులు నింపినప్పటికీ.. తాజాగా పెరిగిపోయిన నిరుద్యోగ సమస్య ఆయన్ను నీడలా వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే మహాకూటమి సీఎం అభ్యర్థి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ నితీశ్కు సవాళ్ల మీద సవాళ్లు విసరుతున్నారు. రాష్ట్రంలో ఏదోఒక స్థానం నుంచి పోటీకి నిలబడి నిరూపించుకోవాలని ఛాలెంజ్ చేస్తుండటంతో గత 35 ఏళ్లుగా నితీశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయని అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అయితే, నితీశ్ మాత్రం ఈ సవాల్ను అంత సీరియస్గా తీసుకోకుండా మరోసారి బిహార్ కోటలో పాగా వేయడమే లక్ష్యంగా తనదైన శైలిలో ఎన్నికల ప్రణాళికను కొనసాగిస్తున్నారు.
తొలిసారి ఎనిమిది రోజులే సీఎంగా..
నితీశ్ కుమార్ 2005 నుంచి ఇప్పటివరకు మొత్తం ఆరు పర్యాయాలు బిహార్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. 2000 సంవత్సరంలో ఎనిమిది రోజుల పాటే ముఖ్యమంత్రిగా కొనసాగినప్పటికీ.. ఆ తర్వాత 2005, 2010, 2015, 2017లలో సీఎంగా బాధ్యతలు నిర్వహించి బిహార్లో తిరుగులేని నేతగా కొనసాగుతున్నారు. అయితే, ఆరు పర్యాయాలు ముఖ్యమంత్రిగా కొనసాగినా ఆయన ఎమ్మెల్యేగా ఎక్కడి నుంచీ ప్రాతినిధ్యం వహించకపోవడం గమనార్హం. ఎందుకంటే శాసనమండలి సభ్యుడిగా ఉంటూ ఆయన సీఎంగా సేవలందిస్తూ వస్తున్నారు.
![Did you know Nitish Kumar never contested Bihar assembly polls from last 35 years](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9408219_2222.jpg)
ఎంపీగా ఆరుసార్లు..
1977లో నితీశ్ కుమార్ నలంద జిల్లాలోని హర్నాట్ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసినప్పటికీ ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత మళ్లీ 1985లో అదే స్థానం నుంచి బరిలో దిగి రికార్డుస్థాయి మెజార్టీతో విజయదుందుభి మోగించారు. ఆ తర్వాత 1989, 1991, 1996, 1998, 1999, 2004 సంవత్సరాల్లో వరుసగా ఆరు పర్యాయాలు లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం 1985 ఎన్నికలే చివరవి. తొలిసారి 2000లో సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయన ఏ సభలోనూ సభ్యుడు కాదు. అయితే, అసెంబ్లీలో తనకు సరైన మెజార్టీ లేకపోవడంతో కేవలం ఎనిమిది రోజులకే (మార్చి 3 నుంచి 10 వరకు) రాజీనామా చేయాల్సి వచ్చింది.
ఆ నిబంధన ప్రకారమే..
2005 నవంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా- జేడీయూ కూటమి గెలుపొందింది. దీంతో నితీశ్ రెండోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అప్పుడు కూడా ఆయనకు ఏ చట్టసభలోనూ సభ్యత్వం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (4) సెక్షన్ ప్రకారం సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ఆరు నెలల్లోపు ఏదో ఒక సభ (అసెంబ్లీ లేదా శాసనమండలి)కు సభ్యుడిగా ఎన్నికవ్వాలనే నిబంధన ఉంది. దీంతో 2006లో నితీశ్ శాసనమండలికి ఎన్నికయ్యారు. ఎమ్మెల్సీ పదవీకాలం 2012 వరకు ఉండగానే 2010లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి భాజపా - జేడీయూ కూటమి భారీ మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడంతో ఆయన వరుసగా మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. 2012లో ఎమ్మెల్సీగా తన పదవీ కాలం ముగియడంతో మళ్లీ మండలికే ఎన్నికయ్యారు.
![Did you know Nitish Kumar never contested Bihar assembly polls from last 35 years](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9408219_66666.jpg)
నైతిక బాధ్యతతో రాజీనామా..
అనంతరం 2013లో భాజపాతో ఉన్న స్నేహాన్ని తెంచుకొని దేశాన్ని ఆశ్చర్యపరిచారు నితీశ్. 2014 లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరుకు దిగారు. మోదీ వేవ్ కారణంగా జేడీయూకి ఘోర పరాభవం ఎదురవ్వడంతో ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం పదవి నుంచి తప్పుకొన్నారు. దీంతో అప్పట్లో జేడీయూలో ఉన్న జితిన్ రాం మాంఝీ సీఎంగా బాధ్యతలు చేపట్టారు. 2015 ఫిబ్రవరిలో జితిన్ రాం మాంఝీ జేడీయూ నుంచి బహిష్కరణకు గురవ్వడంతో నితీశ్ నాలుగోసారి సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ, కాంగ్రెస్లతో మహాకూటమిగా బరిలోకి దిగి విజయం సాధించిన ఆయన ఐదోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆర్జేడీ నుంచి లాలూ తనయుడు తేజస్వీ యాదవ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతల్లో ఉన్నారు. ఆ సమయంలో తేజస్వీపై అవినీతి ఆరోపణలు రావడంతో నితీశ్ ఆయన్ను కేబినెట్ నుంచి తొలగించారు. దీనికి ఆర్జేడీ తీవ్ర అభ్యంతరం చెప్పడంతో 2017 జులైలో నితీశ్ సీఎం పదవికి రాజీనామా చేశారు. దీంతో మహా కూటమి చీలిపోయింది. అనంతరం కొద్ది గంటల్లోనే బిహార్లోని రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. మళ్లీ ఎన్డీయే కూటమితో దోస్తీ కట్టిన నితీశ్ కొద్ది గంటల్లోనే మళ్లీ సీఎం పీఠం దక్కించుకున్నారు. 2018లో మరోసారి ఎమ్మెల్సీగా ఎన్నికైన నితీశ్ పదవీ కాలం 2024 నాటికి పూర్తి కానుంది.
![Did you know Nitish Kumar never contested Bihar assembly polls from last 35 years](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9408219_36558.jpg)
అందుకే శాసనమండలి నుంచి....
ప్రజలను నేరుగా ఎదుర్కొనేందుకు నితీశ్ భయపడుతున్నారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు పదేపదే విమర్శిస్తుంటారు. శాసనమండలి నుంచి ఎన్నికవ్వడమే ఆయన తనకు సురక్షితమని భావిస్తున్నారని అంటుంటారు. అయితే, ఇలాంటి విమర్శలకు గతంలో నితీశ్ తనదైన శైలిలో సమాధానం చెప్పారు. తాను ఒక్క స్థానానికే పరిమితం కావాలనుకోవడంలేదని, అందుకే తాను అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేయడంలేదని చెప్పుకొచ్చారు. మరోవైపు, బిహార్లో రెండో విడత ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. 17 జిల్లాల పరిధిలోని 94 స్థానాలకు నేడు పోలింగ్ జరగనుంది.
ఇదీ చూడండి: బిహార్ బరి: మూడోదఫాలో 31శాతం మందిపై క్రిమినల్ కేసులు!