కర్ణాటక బెంగళూరుకు చెందిన మనోహర్ అనే వ్యక్తి సులభంగా డబ్బులు సంపాదించాలి అనే ఆలోచనతో అక్రమాలకు తెరతీశాడు. అందుకుగాను తాను అద్దెకు తీసుకున్న ఇంటిని యజమానికి తెలియకుండా వేరొకరికి లీజుకి ఇచ్చాడు.
పరిచయం పెంచుకుని నామం పెట్టాడు.!
ఎలాగైనా ఇంటిని వేరే వారికి లీజుకు ఇచ్చి మోసం చేయాలి అనే ఆలోచన మనోహర్కు ఉండేది. ఈ క్రమంలో అద్దె ఇంటి కోసం ప్రయత్నిస్తున్న నాన్సీతో పరిచయం ఏర్పడింది. ఇరువురి మాటల్లో ఇంటి విషయం ప్రస్తావనకు రాగా తన సొంత ఇల్లును లీజుకు ఇస్తానని చెప్పాడు. అందుకుగాను 36 లక్షల 50వేలు లీజు మొత్తంగా తీసుకున్నాడు.
ఇలా.. బయటపడింది.!
ఆరు నెలల నుంచి అసలు యజమానికి మనోహర్ అద్దె పంపలేదు. కారణం తెలుసుకోవాలని రాగా.. మనోహర్ కుటుంబానికి బదులు నాన్సీ కుటుంబం కనిపించింది. అంతే.. ఆ ఓనర్ కంగుతిన్నాడు. వెంటనే ఖాళీ చేయాలని కోరగా.. తాను ఇచ్చిన మొత్తం చెల్లించాలి అని డిమాండ్ చేశారు. చివరకు విషయం తెలుసుకున్న బాధితులు మోసపోయామని గ్రహించారు.
ఒక్క కుటుంబం కాదు.. నలభై!
బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా ఇప్పటివరకు నిందితుడు నలభై కుటుంబాలను ఇదే రీతిన మోసం చేశాడని తేలింది. మనోహర్ భార్య సీతార్తో పాటు మధ్యవర్తి రాజన్కు కూడా ఇందులో ప్రమేయం ఉందని పోలీసులు వెల్లడించారు.
ఇదీ చూడండి: భార్యను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి 80కి.మీ రిక్షా తొక్కాడు!