సంక్రాంతి పర్వదినాన.. పిల్లలు, పెద్దలు గాలిపటాలు ఎగురవేస్తూ ఆనందంగా గడుపుతారు. నిజానికి పతంగులు ఎగరవేయడం కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తూ ఉంటారు. అదే తరహాలో వాటిపై అమితాసక్తిని పెంచుకున్నాడో వ్యక్తి. ఎంతలా అంటే... గాల్లో ఎగిరితే ఎక్కడ దారం తెగి దూరమైపోతాయోనని.. గాలిపటాల ఆకారాల్లో బంగారు ఆభరణాలను చేయించుకున్నాడు ఈ మధ్యప్రదేశ్ వాసి. ఒకటి కాదు, రెండు కాదు... రకరకాల పసిడి పతంగుల గొలుసులను తన మెడలో వేలాడేసుకుని గాలిపటాలపై తనకున్న అభిరుచిని చాటుకుంటున్నాడు లక్ష్మీనారాయణ ఖండేల్వాల్.
'పతంగి' ఆభరణాలతో..
భోపాల్లోని ఇత్వారా ప్రాంతానికి చెందిన ఖండేల్వాల్కు గాలిపటాలతో ప్రత్యేక అనుబంధముందట. పతంగులపై అతడికున్న అభిమానాన్ని చూసి.. స్థానికులు 'కైట్ మ్యాన్' అని కూడా పిలుస్తారట. ఓ చిన్న దుకాణంలో హోల్సేల్గా పతంగుల వ్యాపారం చేసే అతడికి.. తన 50ఏళ్లలో వాటిపై అభిరుచి పెరిగింది. వాటిపై ప్రేమతో.. అవి ఎల్లప్పడూ తన చెంతే ఉండాలని భావించాడు. ఇందుకోసం ఏకంగా పసిడి ఆభరణాలతో.. మెడలో గొలుసు, చేతికి ఉంగరాలు, చెవిలీలు పతంగి ఆకారంలో చేయించుకున్నాడు. అందరూ సంక్రాంతి రోజు మాత్రమే గాలిపటాలను గుర్తుచేసుకుంటే.. లక్ష్మీనారాయణ మాత్రం రోజూ వాటితో మురిసిపోతున్నాడు.
ఐదారు లక్షల రూపాయలు వెచ్చించి..
చిన్న నాటి నుంచీ గాలిపటాలను ఎగురవేయడం అంటే ఇష్టపడే లక్ష్మీ నారాయణ.. ఏటా సంక్రాంతి కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తానని చెప్పాడు. పతుంగులపై అభిమానంతోనే.. ఐదారు లక్షల రూపాయలు వెచ్చించి.. 10 నుంచి 12 తులాల(100-120గ్రాములు)పసిడితో ఆభరణాలు చేయించుకున్నట్టు వివరించాడు. ఇలా కొన్నేళ్లుగా.. ఏటా పుత్తడితో తయారైన కొత్త పతంగి ఆభరణాన్ని ధరించే లక్ష్మీ నారాయణ.. ఈ ఏడాది 2తులాల గొలుసు సిద్ధంగా ఉందన్నాడు.
ఇలా.. సంక్రాంతిపై ఆసక్తితో భోపాల్ సహా.. ఇతర నగరాల్లోనూ పండుగ ఉత్సవాల్లో పాల్గొంటాడు లక్ష్మీనారాయణ. పండుగ పూట అతడి వ్యాఖ్యానాలు వినేందుకు.. చుట్టుపక్కల జనాలు కూడా పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు.
ఇదీ చదవండి: నదిలో బంగారు నాణేలు- తండోపతండాలుగా జనాలు