కశ్మీర్కు చెందిన ఓ యాపిల్ తోట యజమాని అర్ధరాత్రి తన తోటలోని పండ్లను వడివడిగా ట్రక్కులో నింపుకుని దిల్లీకి తీసుకెళ్లాడు. కశ్మీర్ దాటేంతవరకూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ట్రక్కు నడిపాడు. ఎలాగోలా దిల్లీకి చేరుకుని పండ్లు అమ్మి 60 వేల రూపాయలు సంపాదించి, ఆనందంతో తిరుగుపయనమయ్యాడు. కానీ మార్గమధ్యంలో ముగ్గురు ముష్కరులు అడ్డుపడి ఆ రైతుకు రెండు మార్గాలు సూచించారు.
ట్రక్కునైనా తగుల బెట్టాలి, లేదా కాలుపై తూటా దించినా సిద్ధంగా ఉండాలి. కాలిని కోల్పోలేక.. జీవనాధారమైన ట్రక్కును కోల్పోవడానికి సిద్ధపడ్డాడు ఆ రైతు. ఇది ఆ ఒక్కడిదే కాదు.. కశ్మీర్లోని యాపిల్ తోటల యజమానులందరి పరిస్థితి.
జమ్ముకశ్మీర్లోని 4 జిల్లాల్లో యాపిల్ వ్యాపారమే జీవనాధారం. ఈ నేపథ్యంలో యాపిల్ పండ్ల వాణిజ్యం 30 వేల టన్నులకు పడిపోయింది. 2018 సెప్టెంబర్ మధ్య కాలం నాటికి 80 వేల టన్నుల యాపిల్స్ విక్రయం జరగగా ప్రస్తుత ఏడాది అది కేవలం 50 వేల టన్నులు మాత్రమే.
కారణం...
కశ్మీర్లో గత 50 రోజులుగా వ్యాపారాలు జరగట్లేదని యాపిల్ సహా చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ ఆగస్టు 5న కేంద్రం ప్రకటించటానికి కొద్ది రోజుల ముందే నిషేధాజ్ఞలు జారీ చేసింది. ఆయా సందర్భాలకు అనుగుణంగా పాక్షిక సడలింపులు చేస్తోంది.
7 వారాలుగా లోయలో అంతర్జాల సౌకర్యాన్ని నిలిపేసింది ప్రభుత్వం. రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో పునరుద్ధరణ కాలేదు. విద్యార్థుల రాకకోసం పాఠశాలలు ఎదురుచూస్తున్నాయి.
పళ్ల తోటల యజమానులపై ఉగ్రవాద సంస్థల నుంచి బెదిరింపులు, ట్రక్కులే లక్ష్యంగా దాడులు చేయడం వంటి ఘటనలు వాణిజ్య కార్యకలాపాలు పూర్తిస్థాయిలో ప్రారంభం కాకపోవడానికి కారణంగా తెలుస్తోంది.
"పోలీసులకు సందేశాలు పంపుతున్నాం. ఉన్నతస్థాయి అధికారులు మాటలు చెబుతున్నా క్షేత్రస్థాయిలో అనుకూల పరిస్థితులు ఏర్పడటం లేదు."
-వ్యాపారి. షోపియాన్ జిల్లా
యాపిల్ వ్యాపారులు, కూలీలు, వాహనాలు లక్ష్యంగా ఇప్పటివరకు 40 ఘటనలు జరిగాయని పేర్కొన్నారు పోలీసులు.
బడి గంట మోగడం లేదు...
విద్యార్థులు పాఠశాలలకు వెళ్లడానికి భయపడుతున్నారు. పాఠశాలలు తెరిచినప్పటికీ పిల్లల తల్లిదండ్రులు వారిని పంపడానికి భయపడుతున్నారు. ఓవైపు ఆంక్షలు.. మరోవైపు ముష్కరుల బెదిరింపులతో కశ్మీర్ రైతులు, విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉంది.
ఇదీ చూడండి: కేదార్నాథ్: హెలికాఫ్టర్కు తప్పిన ప్రమాదం