ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడంటారు.. అదే నమ్మకంతో మమ్మల్ని ఎవరేం చేస్తారులే అనుకున్నారో ఏమో! ఘరానా దొంగల అవతారం ఎత్తారు బాధ్యత గల పోలీసులు. చివరకు అడ్డంగా దొరికి సస్పెండయ్యారు.
గోరఖ్పుర్లోని మహారాజ్గంజ్కి సమీపంలోని పాడ్లీ గంజ్ వద్ద ఆభరణాల చోరీ ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు ఊహించని మలుపులు ఎదురయ్యాయి. పోలీసు సిబ్బందే దొంగతనానికి పాల్పడ్డారని తెలిసి అవాక్కయ్యారు. అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు సహోద్యోగులు.
ఘరానా పోలీసులు..
గోరఖ్పుర్ నుంచి లఖ్నవూకు దీపక్ వర్మ, రాజు వర్మలు బుధవారం ఉదయం బస్సులో బయలుదేరారు. పాడ్లీ గంజ్ ప్రాంతంలో బస్సును అడ్డుకున్న ఆరుగురు వ్యక్తులు లోపలికి ప్రవేశించి దీపక్, రాజులను కిందికి దింపారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. వీరిద్దరినీ నౌషద్ అనే ప్రాంతానికి తీసుకెళ్లి కొట్టి నగదు, బంగారం, వెండి బ్యాగులు లాక్కుని.. అక్కడి నుంచి పరారయ్యారు.
ఎస్సై.. కానిస్టేబుల్స్..
సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. దొంగలు కూడా పోలీసులే అని తెలిసుకుని ఆశ్చర్యపోయారు. అరెస్టైన వారిలో పురాణిబస్తీ పోలీస్ స్టేషన్ ఎస్సై ధర్మేందర్ యాదవ్, కానిస్టేబుళ్లు మహేంద్ర యాదవ్, సంతోష్ యాదవ్ ఉన్నారు. వీరి వద్దనుంచి రూ .19 లక్షల నగదు, రూ .12 లక్షల విలువైన బంగారం, రూ .4 లక్షల విలువైన వెండి, కారు స్వాధీనం చేసుకున్నారు.
ఛీ..ఛీ..
ముగ్గురినీ సస్పెండ్ చేసిన ఉన్నతాధికారులు.. పోలీసు వృత్తికే తలవంపులు తెచ్చిన వీరిని శాశ్వతంగా తొలగించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఈ ఘటనలో సకాలంలో స్పందించని మరో 9 మందిని సస్పెండ్ చేసినట్లు ఎస్పీ హేమరాజ్ మీనా తెలిపారు.
ఇదీ చదవండి: అధికారికి తేజస్వీ ఫోన్.. వీడియో వైరల్