Ram Mandir Ayodhya : అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. దానితో పాటు అయోధ్య నగరాన్ని అభివృద్ధి చేయడానికి యోగి సర్కార్ ప్రత్యేక ప్రణాళికలు రచించింది. అందులో భాగంగానే 37 పురాతన ఆలయాలు, మఠాలు, చెరువులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతోంది. వాటి కోసమే యోగి సర్కార్ ప్రత్యేకంగా 67 కోట్లతో బడ్జెట్ను కేటాయించింది. మొదటి విడతగా 34 కోట్ల 55 లక్షలను విడుదల చేసింది. అయోధ్య నగర అభివృద్ధి చేసే బాధ్యతను ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్కు అప్పగించింది. డిసెంబర్లోపు అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించింది. భక్తులు రామమందిర దర్శనం వరకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలను సందర్శించేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
ఇప్పటికే పురాతన ఆలయాలు, మఠాలను విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించారు. సూర్య కుంద్ చెరువులో లైట్, సౌండ్ షోలను ఏర్పాటు చేశారు. లైట్ షోలో భాగంగా రామాయణాన్ని ప్రదర్శించనున్నారు. సాయంకాల వేళ చెరువు దగ్గర భక్తులు ఆహ్లాదంగా గడిపేందుకు ఫౌంటెయిన్ను ఏర్పాటు చేశారు. వారసత్వ ప్రదేశాలను పరిరక్షించడంతో పాటు వాటిని పునరుద్ధరించడం ప్రణాళికలో భాగమేనని కలెక్టర్ నితీశ్ కుమార్ తెలిపారు. రామమందిరాన్ని వచ్చే ఏడాది జవవరిలో ప్రారంభించాలని ఇప్పటికే శ్రీ రామ జన్మభూమి తీర్థ ట్రస్టు నిర్ణయించింది. అందుకు అనుగుణంగానే గ్రౌండ్ ఫ్లోర్ నిర్మాణ పనులు 80 శాతం పూర్తయ్యాయి.


అయోధ్యలో పెద్దఎత్తున హోటళ్లు, రిసార్ట్లు, హోమ్స్టేలు బుకింగ్..
Ayodhya Ram Mandir Inauguration : వచ్చే ఏడాది జనవరి 15-24 మధ్య జరిగే రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠాపనను తిలకించేందుకు భక్తులు సమాయత్తం అవుతున్నారు. ఆ అపూర్వ ఘట్టాన్ని చూసేందుకు తహతహలాడుతున్న భక్తులు.. ఇప్పుడే పెద్దఎత్తున హోటళ్లు, రిసార్ట్లు, హోమ్స్టేలు బుక్ చేసుకుంటున్నారు. లక్షల్లో ప్రజలు తరలివచ్చే అవకాశాలున్నాయని హోటళ్ల యజమానులు చెబుతున్నారు. ట్రావెల్ ఏజెన్సీల ద్వారా తమను సంప్రదించే వారు 10, 12 రోజులు ఉండేలా గదులు బుక్ చేసుకుంటున్నారని తెలిపారు. దిల్లీ, మహారాష్ట్ర, ఇతర మెట్రో నగరాల నుంచి ఎక్కువగా సంప్రదిస్తున్నారని వివరించారు. ముంబయికి చెందిన ఓ ట్రావెల్ ఏజెన్సీ.. వారం పాటు 15వేల గదులు కావాలని అడిగినట్లు ఓ రిసార్ట్ ప్రకటించింది. పూర్తి కథనం కోసం ఇక్కడి క్లిక్ చేయండి.