ఆమెకు నిశిత పరిశీలన ఎక్కువ. అలానే దేశంపై అభిమానం. సంస్కృతిపై ప్రేమ కూడా. తన తండ్రి నుంచి వారసత్వంగా అబ్బిన కళతో దేశ ఔన్నత్యాన్ని చాటాలనుకుంది కేరళ కోజికోడ్కు చెందిన రోశ్నా. అనుకున్నదే తడవుగా ఆ యువతి కుంచె పట్టి బొమ్మలు గీయడం ప్రారంభించింది. అలా ఆమె గీసిన బొమ్మల సమాహారానికి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించింది.
ఇప్పటికే 25 అంతర్జాతీయ పతకాలను తన ఖాతాలో వేసుకున్న ఈ 19 ఏళ్ల యువతికి దుబాయ్లో జరిగిన గ్లోబల్ విలేజ్ సీజన్-25 కార్యక్రమంతో మంచి గుర్తింపు లభించింది. ఈ పోటీల్లో ప్రపంచంలోని అన్నీ దేశాలకు చెందిన వారు పాల్గొని వారి సంస్కృతి, సంప్రదాయలను ప్రతిభింబించేలా కార్టూన్లు గీసి ప్రదర్శించారు. ఈ క్రమంలోనే భారతదేశ సంప్రదాయాలను కొట్టొచ్చినట్లు కనిపించేలా రోశ్నా వేసిన బొమ్మలు అవార్డును గెలుచుకున్నాయి.
రోశ్నా తండ్రి దిలీప్ ప్రముఖ కార్టూనిస్ట్. చిన్ననాటి నుంచి నాన్న వేసి కార్టూన్లను చూస్తూ పెరిగింది. దీంతో ఆమె కూడా ఆ కళపై పట్టు సాధించాలని అనుకుంది. అలా తన ప్రస్థానాన్ని సాగించింది. 2015లో మొదటిసారిగా కార్టూన్లు గీసి గిన్నిస్ రికార్డ్ జ్యూరీకి పంపించింది. కానీ విఫలమైంది. ఆ తరువాత రెండో ప్రయత్నంలో విజయం సాధించింది.
ఇదీ చూడండి: దొంగతనానికి పోయి... ఏటీఎంలో ఇరుక్కుపోయాడు