Nai Brahmin Garjana Sabha: కులాల మధ్య అంతరాలు తొలగిపోవాలి:ధర్మాన - Backward Community People Should Fight
🎬 Watch Now: Feature Video
Nai Brahmin Garjana Sabha in Srikakulam : సమాజంలో కులాల మధ్య అంతరాలు తొలగిపోవాలని, అందుకు అంతా కృషి చేయాలని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని అంబేడ్కర్ ఆడిటోరియంలో మంగళవారం నాయీ బ్రాహ్మణ గర్జన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరయ్యారు. నాయీబ్రాహ్మణుల డిమాండ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన సర్వీసు ఇనాం పట్టాల విక్రయానికి అవసరమైన చర్యలు చేపడుతున్నామని చెప్పారు.
నాయీ బ్రాహ్మణులను పిలిచే విధానంలో గౌరవం ఉండాలని ఆయన అన్నారు. అత్యంత వెనుకబడిన కులాలను (ఈబీసీ) న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. వారు ఎవర్ని బలపరిస్తే వారే గెలుస్తారని చెప్పారు. ఈబీసీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్లాలని, అందుకు తన సంపూర్ణ మద్దతు ఉంటుందనన్నారు. అనంతరం నాయీబ్రాహ్మణ సంఘ నాయకులు సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ యానాదయ్య, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు హైమావతి, ఎం.రమణమ్మ, నాయకులు కె.గజపతిరావు, అరవింద్, కొండలరావు, సూర్యనారాయణ, బీసీ సంక్షేమ సంఘ నాయకులు పీ.చంద్రపతిరావు,డీ.పీ.దేవ్ పాల్గొన్నారు.