Golla Arun Kumar fire on YSRCP: 'రాబోయే ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెబుతాం' - mala mahanadu national president golla arun kumar
🎬 Watch Now: Feature Video

Golla Arun Kumar Comments: రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని.. నిత్యం దళితులపై వైసీపీ నేతలు దాడులు చేస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు గోళ్ల అరుణ్ కుమార్ మండిపడ్డారు. దళితులపై దాడులు జరుగుతున్నా.. దళిత మంత్రులు నోరు మెదపకపోవటం సిగ్గు చేటని అన్నారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం కంతేరు గ్రామానికి చెందిన వైసీపీ నేత హరికృష్ణా రెడ్డి , ఆయన సోదరుడు కలిసి దళితులపై చేసిన దాడిని ఖండించారు. దాడి చేసిన వారిని పోలీసులు వెనకేసుకొస్తున్న తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గుంటూరులోని ఎస్పీ కార్యాలయంలో.. ఎస్పీని కలిసి దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ప్రభుత్వంలో దళితులు నిత్యం భయపడుతూ బతుకుతున్నారని విమర్శించారు. దళితులపై దాడులు చేస్తున్న వారికి.. వైసీపీ ప్రభుత్వం ఏదో ఒక పదవి ఇస్తోందని ఆరోపించారు. దాడికి గురైన బాధితులను పరామర్శించడానికి కూడా పోలీసులు అనుమతించకపోవటం దారుణమన్నారు. దళిత ఓట్లతో గద్దెనెక్కిన వారికి.. రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.