Lorry Collided With Bike in Palamaneru: విషాదం.. రోడ్డు ప్రమాదంలో తండ్రి మృతి.. ప్రాణాలతో బయటపడిన ఐదేళ్ల చిన్నారి..
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/22-08-2023/640-480-19326665-thumbnail-16x9-road-accident.jpg)
Lorry Collided With Bike in Palamaneru: చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఓ యువకుడి పైనుంచి లారీ వెళ్లటంతో ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. చిన్నారిపై నుంచి వెళ్లినా అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడింది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పలమనేరు రంగబాబు సర్కిల్ వద్ద ఓ లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టగా.. అదుపుతప్పి కిందపడిపోయింది. దీంతో బైక్పై ఉన్న సద్దాం, అతని కుతూరు (5) రోడ్డువైపు.. అతని భార్య డివైడర్ వైపు బైక్పై నుంచి ఎగిరిపడ్డారు. ఈ క్రమంలో సద్దాంపై నుంచి లారీ వెళ్లగా తీవ్రగాయాలై ప్రమాద స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. చిన్నారి లారీ కిందకు వెళ్లిపోవటంతో.. చక్రాలు పక్కగుండా వెళ్లి ప్రాణాలతో బయటపడింది. భార్య రుక్తార్ డివైడర్ వైపు పడటంతో స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ లారీ రన్నింగ్లో ఉండగానే అందులోంచి దూకి పారిపోయాడని స్థానికులు అంటున్నారు. కొంతదూరం పరుగెత్తిన తర్వాత అతడ్ని పట్టుకున్న స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వారు వెల్లడించారు.