Bopparaju on OPS: పాత పింఛన్ విధానం అమలుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలి: బొప్పరాజు
APJAC Amaravati President Bopparaju on OPS: పాత పింఛన్ విధానానికే ఏపీ ఐక్య కార్యచరణ సమితి(APJAC) అమరావతి కట్టుబడి ఉందని ఆ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. పాత పింఛన్ విధానం అమలుకు ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరు రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించిన ఏపీ జేఏసీ నాలుగో ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో బొప్పరాజు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. సీపీఎస్ రద్దు, ఓపీఎస్ అమలు కోసం తొలి నుంచి పోరాడింది తామేనని చెప్పారు. పాత పింఛన్పై హామీ ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వమేనన్న బొప్పరాజు... మళ్లీ చలో విజయవాడ పునరావృతం కాకూడదని ప్రభుత్వానికి చెప్పామని స్పష్టం చేశారు. ఉద్యోగుల సమస్యలపై ఈ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం.. ఏ ప్రభుత్వానికీ ఇవ్వలేదని ఆయన తెలిపారు. 92 రోజులుగా అలుపెరుగని పోరాటం చేస్తున్నామని.. ఉద్యమం ఫలితంగానే చాలా డిమాండ్లు సాధించామని బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.