Smartphones Effect on Kids : డిజిటల్ ఉపకరణాల వినియోగం పిల్లల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావం చూపుతోంది. ఎలక్ట్రానిక్ తెరలను ఎక్కువగా చూస్తుండటంతో చిన్నారుల్లో కంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. అలాగే మానసిక సమస్యతో చదువులో వెనుకబడిపోతున్నారు.
విద్యార్థుల్లో కంటి సమస్యలు : ఏలూరు జిల్లా నూజివీడులో ఓ విద్యార్థి స్మార్ట్ ఫోన్ అధికంగా వినియోగించడంతో చివరికి కంటి చూపు మందగించింది. మరో బాలుడు ఇటీవల తండ్రి చరవాణిలో ఆన్లైన్ గేమ్స్ ఆడుతూ బ్యాంకు ఖాతాలోని రూ.70 వేలు పోగొట్టాడు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 5,860 మంది విద్యార్థుల్లో కంటి సమస్యలున్నట్లుగా రాష్ట్రీయ బాల స్వస్త్య కార్యక్రమ్ వైద్యుల పరీక్షల్లో తెలింది. ఇందులో 50 శాతానికిపైగా స్మార్ట్ ఫోన్లులే కారణమని వైద్యులు చెబుతున్నారు.
ఆస్ట్రేలియాలో నిషేధం : పదహారేళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధిస్తున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని వెల్లడించారు. ఆన్లైన్లో పిల్లల భద్రత గురించి ఆందోళన చెందుతున్న తల్లిదండ్రుల కోసం ఈ చట్టాన్ని తీసుకొస్తున్నామని స్వయంగా ప్రధానే అన్నారంటే అక్కడ పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు.
సృజనాత్మకత లోపం : మైదానంలో ఉల్లాసంగా ఆడుకోవాల్సిన పిల్లలు స్మార్ట్ ఫోన్లలో బందీ మారుతున్నారు. స్కూల్లో ప్రాజెక్టు వర్క్స్ ఇచ్చినా చివరికీ గూగుల్పై ఆధారపడుతున్నారు. దీంతో సృజనాత్మకతను కోల్పోవడంతో పాటు వివిధ రకాల రుగ్మతలకు లోనవుతున్నారు. దేశవ్యాప్తంగా 14-16 సంవత్సరాల మధ్య వారిలో 82 శాతం మంది చరవాణీలు వినియోగిస్తున్నట్లుగా వార్షిక విద్యా స్థాయి నివేదిక తాజా అధ్యయనంలో పేర్కొంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 4,94,255 మంది విద్యార్థులుంటే వీరిలోనూ అదే పరిస్థితి కనిపిస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 95 శాతం గృహాల్లో స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. వీరిలో స్మార్ట్ ఫోన్లు అధిక శాతం వినియోగిస్తోంది విద్యార్థులేనని తెలుస్తోంది.
తల్లిదండ్రులు ఏం చేయాలి : స్మార్ట్ఫోన్ వల్ల కలిగే అనర్థాల గురించి తరచూ పిల్లలకు తెలిపాలి. బడి నుంచి ఇంటికి రాగానే దగ్గరుండి వారితో హోమ్ వర్క్ చేయించాలి. పిల్లలున్న సమయంలో తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ వాడకపోవడం మంచిది. లేదంటే పెద్దలు చూసే వీడియోలు, సామాజిక మాధ్యమాలు, రీల్స్కు త్వరగా అలవాటు పడతారు. ముఖ్యంగా గేమ్స్ ఆడకుండా చూడాలి.
డిప్రెషన్లోకి వెళ్తారు : చరవాణులకు పిల్లలను దూరంగా ఉంచాలని మానసిక వైద్య నిపుణురాలు డా.కె.హన్నా కోమలి పేర్కొన్నారు. తల్లిదండ్రులు పిల్లలతో ఆటలు ఆడించడం, వీలైతే వారితో కలసి ఆడటం మంచిదన్నారు. ఫోన్తో ఎక్కువ సేపు గడిపేవారు ఎవ్వరితో మాట్లాడేందుకు ఇష్టపడరన్నారు. వాగ్వాదం, అరవడం చేస్తుంటారని, పరిస్థితి మితిమీరితే డిప్రెషన్లోకి వెళ్తారని తెలిపారు.
జిల్ల్లాల్లో దృష్టిలోపం ఉన్న విద్యార్థులు
- ఏలూరు 3,165
- పశ్చిమ 2,695
Prathidwani: సెల్లో బందీ కాకుండా డిజిటల్ దూరం పాటించడమెలా ?
'ఏడుస్తున్నారని ఇచ్చేస్తున్నారా!' - ఐదేళ్లలోపు చిన్నారుల్లో ఎన్నో సమస్యలు - వైద్యులు ఏమంటున్నారంటే!