Bandi Srinivasa Rao about OPS: ఓపీఎస్ ఇచ్చేవరకూ పోరాడుతూనే ఉంటాం: బండి శ్రీనివాసరావు
AP NGO about OPS: ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జీపీఎస్ని స్వాగతిస్తూనే.. అదే విధంగా పాత పెన్షన్ ఇచ్చేవరకు ఉద్యమం చేస్తామని.. ఏపీ ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. శ్రీకాకుళంలోని ఏపీ ఎన్జీవో హోంలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. రాష్ట్ర సహాధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డితో కలిసి.. బండి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈనెల 21, 22వ తేదీల్లో విజయవాడలో జరగనున్న.. 21వ రాష్ట్ర మహాసభలకు.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు హాజరుకానున్నారని ఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు చెప్పారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలు ఒక్కొక్కటిగా ముఖ్యమంత్రి చొరవ తీసుకుని పరిష్కారం చేస్తున్నారని బండి శ్రీనివాసరావు అన్నారు. ప్రభుత్వం మా డిమాండ్ల వైపు చూస్తున్నారనే నమ్మకం మాలో ఉందన్నారు. అదే విధంగా వివిధ శాఖలలో ఉన్న పని చేస్తున్న.. పలువురు కాంట్రాక్టు ఉద్యోగులకు 18 నెలలుగా జీతాలు రావడం లేదని తెలిపారు. వారికి వీలైనంత త్వరగా జీతాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.