వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని అనుకున్నారు. కానీ చివరకు ప్రియుడు ప్లేట్ ఫిరాయించాడు. అతడితో కలిసి తన జీవితాన్ని ఊహించుకున్న ఆ యువతికి ఏం చేయాలో తోచలేదు. అదే సమయంలో ఆ వ్యక్తి మరోకరితో ప్రేమాయణం సాగిస్తున్నాడనే అనుమానం కలిగింది. తీవ్ర ఆవేశంలో పెళ్లికి నిరాకరించిన ప్రియుడిని హత్య చేసింది.
పశ్చిమ గోదావరి జిల్లాలోని తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు, తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన జీ.పావని రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. తమ ప్రేమను వివాహ బంధంగా మార్చాడానికి పావని ప్రయత్నించింది. కొద్ది నెలలుగా పెళ్లి చేసుకోవాలని ప్రియుడు తాతాజీ నాయుడును అడిగింది. అయితే పెళ్లి చేసుకునేందుకు తాతాజీ నిరాకరించాడు. సోమవారం మధ్యాహ్నం తాతాజీ బైక్పై పంగిడి వచ్చాడు. పావని కూడా అక్కడికి వచ్చింది. సాయంత్రం వరకు పంగడి పరిసర ప్రాంతాల్లో ఉన్నారు. అనంతరం తాతాజీ పావనిని బైక్పై ఎక్కించుకుని ఆమె ఊరు మలకపల్లిలో దించేందుకు బయలుదేరాడు.
అప్పటికే తాతాజీని అంతం చేయాలని ప్లాన్ వేసిన పావని.. బైక్ ధర్మవరం-కాపవరం గ్రామాల మధ్యకు చేరుకున్న సమయంలో తన పథకాన్ని అమలుచేసింది. బైక్పై వెళ్తుండగా తన బ్యాగ్లోని కత్తి తీసి తాతాజీ వీపుపై పొడిచింది. ఈ ఘటనతో బైక్ అదుపుతప్పి ఇద్దరు కిందపడిపోయారు. కిందపడిన తాతాజీపై పావని మళ్లీ కత్తితో దాడి చేసింది. తీవ్ర రక్తస్రావమైన తాతాజీ.. ఘటన స్థలంలోనే మృతి చెందాడు. ఇది గమనించిన స్థానికులు, అటుగా వెళ్తున్నవారు స్థానిక పోలీసులకు సమచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చదవండి: పండగ బట్టలు కొనేందుకు వెళ్లి... అనంత లోకాలకు!