విజయనగరం జిల్లా చీపురుపల్లి వద్ద తోటపల్లి జలాశయం పూర్తయి నాలుగేళ్లు కావస్తోంది. దీని ద్వారా జిల్లాలో 11 వేల 946 ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఇందుకు 117 కిలోమీటర్ల పొడవున్న కుడికాలువ కీలకమైంది. ఈ కాలువ గరుగుపల్లి మండలం తోటపల్లి వద్ద మొదలై గుర్ల మండలం గాడిగడ్డ జలాశయం వద్ద ముగుస్తుంది.
దీనిద్వారా ఏటా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే అవసరమైన చోట వంతెనల నిర్మాణం చేపట్టలేదు. ప్రధాన కాలువపై వంతెన లేనిచోట ప్రజల ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. నిర్మాణాలు పూర్తి కాక... వంతెన అవతలి వైపున ఉన్న తమ పొలాలకు వెళ్లేందుకు అవస్థ పడుతున్నామని రైతులు చెబుతున్నారు.
ఈ కుడికాలువ పొడవునా 15 వంతెనలు నిర్మించాల్సి ఉంది. పార్వతిపురం ఇంజినీరింగ్ డివిజన్ పరిధిలో 4, రాజాం ఇంజనీరింగ్ డివిజన్ పరిధిలో 11 వంతెనల నిర్మాణానికి గతంలో ప్రభుత్వం రూ.6 కోట్ల 17 లక్షల నిధులు ఇచ్చింది. మొత్తం 13 వంతెనలు పూర్తికాగా... రాజాం డివిజన్ పరిధిలో 2 చోట్ల వంతెన పనులు అసంపూర్తిగా ఉన్నాయి.
ఒకటి.. చీపురుపల్లి మండలం పురేవలస, రామలింగాపురం పొలాల మధ్య ఉంది. ఆ వంతెన అసంపూర్తిగా ఉండడం కారణంగా... చుట్టూ 4 కిలోమీటర్లు తిరిగి తమ పొలాలకు వెళ్లాల్సి వస్తోందని అన్నదాతలు చెబుతున్నారు. రెండోది... చుక్కవలస గ్రామానికి ఆనుకొని ఉన్న వంతెన. దీనికి అటువైపున బాతువ రైల్వేస్టేషన్ ఉంది. ఈ బ్రిడ్జి పనులు పూర్తికాక... విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణం త్వరగా పూర్తిచేసి... తమ ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.
ఇవీ చదవండి..