తమిళనాడు-ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల సముద్ర తీరంలో పులికాట్ ఉప్పునీటి సరస్సు ఏర్పడింది. సముద్రంలోని ఆటుపోటుల నుంచి వచ్చే ఉప్పునీటితో సహజసిద్దంగా వందల ఏళ్ల కిందట ఏర్పడింది. ఆరంబాకం నుంచి తడ, సూళ్లూరుపేట, వాకాడు వరకు 600 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. ఇందులో 460 కిలోమీటర్లు ఆంధ్రావైపు, 140 కిలోమీటర్లు తమిళనాడు రాష్ట్రంలో ఉంటుంది. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం పులికాట్ను సంరక్షిస్తుంది. ఆంధ్రప్రదేశ్ వైపు ఉన్న 460 కిలోమీటర్ల నిర్వహణను వదిలివేశారు. ఫలితంగా సరస్సు పూడిపోతుంది. స్వరూపం కోల్పోయింది.
460 కిలోమీటర్లు మన రాష్ట్రంలో ఉన్న సరస్సు 100 కిలోమీటర్లు విస్తీర్ణం మట్టితో పూడిపోయింది. సరస్సు లోపల ఇసుక, మట్టి మేటలతో మైదానంలా మారింది. ఇది స్వరూపం కోల్పోడానికి కారణం సముద్రంలో అటుపోటుల వల్ల వచ్చే నీరు పులికాట్లోకి రావడంలేదు. సముద్రాన్ని, పులికాట్ను రెండు భాగాలుగా విభజిస్తూ పెద్ద మేటలు ఏర్పడ్డాయి. పులికాట్లోకి నీరు రావాలంటే పూర్వం రాయదొరువు, కొండూరు వద్ద ప్రధానమైన రెండు ముఖద్వారాలు ఉన్నాయి. ఈ ముఖద్వారాల నుంచి సముద్రం నీరు ఆటుపోటుల ద్వారా పులికాట్లోకి వస్తే సరస్సు కళకళలాడుతుంది.
గత 20 ఏళ్లుగా ముఖద్వారాలు పూడిపోవడం మొదలయ్యాయి. పూర్తిగా మూసుకుపోవడంతో ఆటుపోటుల ద్వారా పులికాట్లోకి నీరు రావడం లేదు. పులికాట్ చుట్టూ 60పైగా మత్స్యకార గ్రామాలు ఉన్నాయి. 25వేల కుటుంబాలు పులికాట్లో చేపల వేట ద్వారా ఉపాధి పొందుతున్నారు. పరోక్షంగా మరో 25 వేల మంది ఆధారపడి ఉన్నారు. పులికాట్లో సముద్ర ఉత్పత్తులు లేకపోవడంతో ఉపాధిని కోల్పోయారు. కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పులికాట్ సరస్సులో అనేక రకాలైన చేపలు, రొయ్యలు దొరుకుతాయి. ఒక్కసారి వేటకు వెళ్లారంటే ప్రతి కుటుంబం రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తారు. ప్రస్తుతం వేట మొక్కుబడిగా మారింది. చెన్నై ప్రాంతాలకు వలసలు పోతున్నారు. వేట జరగకపోవడంతో మత్స్యకారులు హోటల్స్లోనూ, దుకాణాల్లోనూ కూలీలుగా పనిచేస్తున్నారు. రోజుకు మూడునాలుగు వందల రూపాయల కూలీకి వెళ్తున్నామని వారు వాపోతున్నారు. పిల్లలను చదివించుకోవడం కూడా కష్టంగా మారిందని అంటున్నారు.
ప్రధానమైన రెండు ముఖద్వారాల్లో మేటలు తొలగించాలని మత్స్యకారులు అనేక సంవత్సరాలుగా అధికారులను, పాలకులను కలుస్తున్నారు. ధర్నాలు కూడా చేశారు. నిరసనలు తెలిపారు. నాలుగేళ్ల కిందట తెదేపా ప్రభుత్వంలో రెండు ముఖద్వారాలు బాగుచేయడానికి 48కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపించారు. ప్రభుత్వం నుంచి అనుమతులు రాలేదు. కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి విజ్ఞాపన చేశారు. రెండుళ్లు కావస్తున్నా ప్రతిపాదనలు అమలుకు నోచుకోలేదని అంటున్నారు. ఏ ప్రభుత్వం వచ్చినా ముఖద్వారాలు సమస్యను పరిష్కరించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని ఇక్కడి ప్రజలు వాపోతున్నారు.
పులికాట్ సరస్సులోకి వచ్చే విదేశీ పక్షుల సంఖ్య కూడా తగ్గుతుంది. పదేళ్ల కిందట వేలాదిగా కొంగలు సరస్సులో వరుసగా నడుస్తుంటే పర్యాటకులు ఆనందంగా చూసేవారు. కొంగలు చేసే సవ్వడి వినడానికి, కిలకిలరావాల కోసం పర్యాటకులు వచ్చేవారు. గత ఐదేళ్లుగా చూస్తే కొంగలు సగానికి సగం తగ్గిపోయాయి. విదేశీ పక్షులు రావడంలేదు. ఆహారం లేక కొన్ని జాతులు అంతరించిపోయాయి. మత్స్య సంపద తగ్గిపోవడం, మడ అడవులు నశించిపోవడం వల్ల పులికాట్ అందాలు కనిపించడంలేదు.
పదేళ్లకు పూర్వం సరస్సు పది అడుగుల లోతు ఉండేది. వేటకు అనుకూలంగా, బోట్లు తిరగడానికి నీరు పుష్కలంగా ఉండేది. ఇప్పుడు మధ్యలో కూడా రెండు మూడు అడుగుల లోతు కూడా కనిపించడంలేదు. కొన్నిచోట్ల కాలువలా మారింది. బోటుకు లంగరు వేయడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. చేపల వేట లేకపోవడంతో కొందరు నత్తగుల్లలు ఏరుకోవడం, వానపాములు పట్టుకోవడం చేస్తున్నారు. ఇలా చేయడం నిషిధ్దం అయినప్పటికీ బతుకుదెరువుకు చేయక తప్పడంలేదని వాపోతున్నారు.
పులికాట్ సరస్సుకు మధ్యలో రాకెట్ కేంద్రం ఉంటుంది. శ్రీహరికోట రాకెట్ కేంద్రానికి మత్స్యకారులు సైనికుల్లా కాపాలా కాస్తారనే పేరు ఉంది. వీరి కష్టాలు మాత్రం ఎవరూ వినడంలేదు. బతుకుదెరువుకోసం తమిళనాడు వైపు వెళ్తే గొడవలు వస్తున్నాయని వాపోతున్నారు. జీవనోపాధి పరిస్థితిని పట్టించుకోవడంలేదని, గ్రామాల్లో ఉన్న తాగునీటి సమస్యలను కూడా తీర్చడంలేదని అంటున్నారు.
ఇదీ చదవండీ... మూడు శతాబ్దాలుగా ఆ గ్రామంలో మద్యపాన నిషేధం