కర్నూలు జిల్లా బనగానపల్లి, డోన్, నియోజకవర్గాల్లో పాలిష్ బండల పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. బనగానపల్లి, అవుకు, బేతంచెర్ల ప్రాంతాల్లోనే సుమారు వెయ్యి పరిశ్రమలు ఉంటాయి. ఒక్కో పరిశ్రమలో 10 నుంచి 15 మంది వరకు కూలీలు ఉపాధి పొందున్నారు. జిల్లాలో 30 నుంచి 40 వేల మందికి పైగా కూలీలు పాలిష్ పరిశ్రమలతో జీవనం సాగిస్తున్నారు. వీరితోపాటు లారీ డ్రైవర్లు, లోడింగ్ అన్లోడింగ్ పనులుచేసే కూలీలు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు.
కోట్లలో వ్యాపారం..:
జిల్లాలో పాలిష్ పరిశ్రమలతో నిత్యం రూ.5 కోట్ల వరకు టర్నోవర్ జరుగుతుంది. పాలిష్ రాళ్లు ఇక్కడి నుంచి రాష్ట్రంలోని అవసరాలతోపాటు ఇతర రాష్ట్రాలకు లారీల్లో తరలిస్తుంటారు. కృష్ణపట్నం, చెన్నై ఓడరేవుల నుంచి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. ఇప్పటికే పరిశ్రమల వద్ద కొంత స్టాకు నిలిచిపోయింది. ఒక్కో చదరం తెల్లరాళ్లు రూ.2,300, నల్ల రాళ్లు రూ.1,300 వరకు అమ్మకాలు సాగిస్తుంటారు. ఇతర దేశాలకైతే రాయి నాణ్యతను బట్టి టన్ను రూ.2500 నుంచి రూ.3 వేల వరకు ఉంటుంది. ఒక్కో లారీలో రూ.80 వేల విలువచేసే రాయిని తరలిస్తుంటారు. కరోనాతో రవాణా ఆగిపోతే పెద్ద మొత్తంలో అందరూ నష్టపోయే ప్రమాదం ఉంటుంది.
అప్పు చేయాల్సి వస్తుంది
పరిశ్రమలో ఇప్పటికయితే పనులు జరుగుతున్నాయి. లాక్డౌన్ పూర్తిస్థాయిలో అమలైతే గత ఏడాదిలాగే పనులు ఆగిపోతాయని భయపడుతున్నాం. ప్రతిరోజూ పనిచేసుకుంటూ రూ.500 కూలితో జీవనం సాగిస్తున్నాం. కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే పాల్గొంటున్నాం. పనులు ఆపేయాల్సి వస్తే యజమానులవద్దే అప్పుచేసి బతకాల్సి వస్తుంది. - రాజేష్, బేతంచెర్ల
ఎప్పుడు ఎలా ఉంటుందో!
గత ఏడాది కరోనాతో తీవ్రంగా నష్టపోయాం. తిరిగి ఈ ఏడాది కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. కర్ఫ్యూ విధించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఇతర ప్రాంతాలకు రవాణా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. పరిశ్రమల వద్ద రాయి నిలిచిపోతే పనులు నిలిపివేసే పరిస్థితి వస్తుంది. రోజులు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నాం. - నాగేశ్వరరెడ్డి, పరిశ్రమ యజమాని
పాలిష్ పరిశ్రమలు: సుమారు 2,500
ఇందులో పనిచేసే కార్మికులు: సుమారు 40,000
నిత్యం టర్నోవర్ : సుమారు రూ.5 కోట్లు
తరలించే రాష్ట్రాలు: కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, ఝార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్
ఇతర దేశాలకు: నెల్లూరు జిల్లా కృష్ణపట్నం, చైన్నై ఓడరేవుల నుంచి
ఇదీ చదవండీ… ఆగని రెమ్డెసివిర్ దందా.. వైద్య సిబ్బంది ప్రమేయంతో నల్లబజారుకు