ప్రశ్న: కర్నూలు జిల్లాలో భారీగా పాజిటివ్ కేసులు వస్తున్నాయి. ఈ తరుణంలో నమూనాల సేకరణ ఏ విధంగా చేస్తున్నారు?
జవాబు: ప్రాథమిక కేంద్రాలు ఉన్న ప్రతి చోట నమూనాలు సేకరిస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో క్యాజువాలిటీల వద్ద కూడా పరీక్షలు విస్తృతంగా చేస్తున్నాం. వృద్థులు, వ్యాధి లక్షణాలు ఉన్నవారి వద్దకు మేమే వెళ్లి యాంటిజెన్ టెస్ట్ చేస్తున్నాం. 4, 5 రోజుల్లో మేము 9 వేల యాంటిజన్ పరీక్షలు చేశాం. కరోనా సోకిన వ్యక్తిని ఐసోలేట్ చేసి వ్యాధి విస్తరించకుండా చేస్తున్నాం. రోజుకు 5 వేల టెస్టుల దాకా చేస్తున్నాం. జిల్లాలో ఇప్పటి వరకు లక్షన్నర పరీక్షలు చేశాం. దీంతో కేసులు ఎక్కువగా వస్తున్నాయి. కేసులు ఎక్కువ వచ్చినా సమస్య లేదు. మరణాలు సంభవించకుండా చూసుకోవడం మా ప్రాధాన్యత. రోగులు ఆలస్యంగా వస్తున్నందున మరణాల రేటు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించాం. 80 శాతం మందికి లక్షణాలు లేవు. వారికి హోం ఐసొలేషన్ ఇస్తున్నాం. హోం ఐసోలేషన్పై సిబ్బందికి శిక్షణ ఇచ్చాం. లక్షణాలు ఉన్నవారిని కొవిడ్ కేంద్రాలకు తరలిస్తున్నాం. వైరస్తో ఎవరూ చనిపోకూడదనే లక్ష్యంతో పని చేస్తున్నాం.
ప్రశ్న: కో మార్బిడిటి సహా కరోనా లక్షణాలు ఉన్న వారిని ఎలా గుర్తిస్తున్నారు?
జవాబు: కమ్యూనికబుల్, నాన్ కమ్యూనికబుల్ డిసీస్ మానిటరింగ్ కోసం కరోనా కంటే ముందు అరోగ్య శాఖ డేటా సేకరించింది. ప్రజలు ఇప్పుడు కొద్ది లక్షణాలు ఉన్నా ఆసుపత్రులకు వస్తున్నారు.
ప్రశ్న: బయటి నుంచి ఎక్కువ మంది జిల్లాలోకి వస్తున్నారు. వీరి వల్ల ఎక్కువ కేసులు వస్తున్నాయని భావిస్తున్నారా?
జవాబు: అవును. అనుమతి తీసుకొని రాష్ట్రంలోకి వస్తున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన అందరినీ ఐసోలేట్ చేశాం. ఇప్పుడు వివధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి సరిహద్దుల్లో పరీక్షలు చేస్తున్నాం. ప్రజలు కూడా స్వచ్ఛందంగా పరీక్షలు చేయించుకుంటున్నారు. క్వారంటైన్ కేంద్రంలో పరీక్ష నిర్వహించి నెగెటివ్ అయితేనే బయటికి పంపుతున్నాం.
ప్రశ్న: పరీక్షలు ఎన్ని రకాలు ఉన్నాయి.. ఎలాంటి వారికి ఎటువంటి పరీక్షలు చేస్తున్నారు ?
జవాబు: మన జిల్లాలో ఆర్టీపీసీఆర్, ట్రూనాట్, యాంటిజెన్ పరీక్షలు చేస్తున్నాం. యాంటీజెన్ పరీక్ష ఫలితం కొన్ని నిమిషాల్లోనే వస్తుంది. ఆసుపత్రి క్యాజువాలిటీల్లో, లక్షణాలు ఉన్న వారికి యాంటీజెన్ పరీక్ష నిర్వహిస్తున్నాం.
ప్రశ్న: పరీక్షలు నిర్వహించే బస్సులు ఎన్ని ఉన్నాయి?
జవాబు: వీరా బస్సులు 7, సంజీవని బస్సులు 3 ఉన్నాయి. వీరా బస్సులు చిన్నగా ఉంటాయి. కార్యాలయాల వద్ద సంజీవని బస్సులు పెడుతున్నాం. బస్సుల ద్వారా ఎన్ని పరీక్షలైనా నిర్వహించవచ్చు. సాయంత్రం వరకు శాంపిల్స్ తీసుకుని ల్యాబ్కు పంపుతాం.
ప్రశ్న: జిల్లాలో ల్యాబ్ల పరిస్థితి ఎలా ఉంది?
జవాబు: ల్యాబ్ల విషయంలో ఇప్పుడు కంఫర్టబుల్గా ఉన్నాం. కర్నూలు మెడికల్ కళాశాలలో 3 ల్యాబ్లు ఉన్నాయి. విజయ డయాగ్నోస్టిక్ వారికి అనుమతి వచ్చింది. వారు పరీక్షలు నిర్వహిస్తున్నారు. 4 ల్యాబ్లు, ట్రూనాట్ మిషన్లు 23 ఉన్నాయి.
ప్రశ్న: ఫలితాలు ఆలస్యం అవుతున్నాయి అంటున్నారు ఎంత వరకు వాస్తవం?
జవాబు: ఇంతకు ముందు ఫలితాల కోసం శాంపిల్స్ పుణే, తిరుపతికి పంపేవాళ్లం. అప్పుడు సమయం పట్టిన మాట వాస్తవమే. ఇప్పుడా పరిస్థితి లేదు. 24 గంటల నుంచి 36 గంటల్లో ఫలితాల ప్రకటిస్తున్నాం. ఫలితాలు త్వరగా ప్రకటించేందుకు ప్రత్యేక అధికారులు పని చేస్తున్నారు.
ప్రశ్న : పరీక్షల కోసం ప్రైవేటు ల్యాబ్లు ఎన్నింటికి అనుమతి ఇచ్చారు?
జవాబు: ఒక్కటే. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్.
ప్రశ్న: కరోనా కేసులు ఎప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది?
జవాబు: ప్రజలకు ఒకటే విజ్ఞప్తి. అందరూ గుంపులుగా తిరగవద్దు, మాస్క్ ధరించండి. బాధ్యతో మెలిగి అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి రావాలి. మాస్క్ లేకుంటే ఫైన్ వేస్తాం..
ఇవీ చదవండి...