కరోనా బారినపడకుండా జిల్లా ప్రజలు మెలకువగా వ్యవహరించాలని ప్రవాసాంధ్రులు సూచిస్తున్నారు. ప్రస్తుతం తామంతా సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉంటూనే పని చేస్తున్నామని, లాక్డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటిస్తున్నామని పేర్కొన్నారు.
అమెరికాలో ఉంటున్న ప్రవాసాంధ్రులకు తెలుగు సంఘాలైన తానా, ఆటా నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందించి అప్రమత్తం చేస్తున్నారు.. తెలుగువారికి అవసరమైన సాయం చేస్తున్నామని దక్షిణ కరోలినాలో ఉంటున్న వ్యాపారవేత్త గోళ్లమూడి శ్రీమంత్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ముందుగా మేల్కొని చర్యలు చేపట్టడంతో అమెరికాలో ఏర్పడిన దుర్భర పరిస్థితులు మనకు రాకుండా అడ్డుకట్ట వేయగలిగారు.. అధికారులు జారీ చేసే సూచనలు పాటిస్తూ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేరీల్యాండ్లో ఉంటున్న కొసరాజు ఫణింద్ర సూచిస్తున్నారు.
ఇప్పుడిప్పుడే నియంత్రణలోకి..
కరోనా బారినపడకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఔషధాల కొరత లేకుండా అవసరమైన అన్ని మందులను ఫార్మా కంపెనీలు ఉత్పత్తి చేస్తున్నాయి. ఫార్మా కంపెనీలో నాణ్యతా నియంత్రణ విభాగంలో పని చేస్తున్నా. వారంలో మూడ్రోజులు కంపెనీకి వెళ్లి పని చేస్తున్నాం. అమెరికాలో ఇప్పుడిప్పుడే పరిస్థితి నియంత్రణలోకి వస్తోంది. అన్ని శాఖలు సమన్వయంతో పని చేస్తున్నాయి. - ఆళ్ల ఐశ్వర్య, ఫార్మా నిపుణురాలు, న్యూజెర్సీ
ఆన్లైన్లో వైద్య సేవలు
కొవిడ్-19 కారణంగా అమెరికాలోను లక్షల మంది ఉపాధి కోల్పోయారు. ఏడాదికి 75 వేల డాలర్ల కన్నా తక్కువ ఆదాయం ఉన్నవారికి ట్రంప్ ప్రభుత్వం 1200 డాలర్ల సాయం అందిస్తోంది. కరోనా లక్షణాలు ఉన్నవారికి ఆన్లైన్లో వైద్యసేవలు అందిస్తున్నారు. అత్యవసరమైతే ఆసుపత్రిలో చేర్పిస్తున్నారు. ఎక్కువ మంది ఇంటి క్వారంటైన్లో ఉంటున్నారు. మన దగ్గర ఇల్లు దాటకుండా ఉంటే మేలు. - గొల్లపూడి ఆదిత్య ప్రశాంత్, బిజినెస్ ఎనలిస్ట్, వాషింగ్టన్ డీసీ
బంధువులను అప్రమత్తం చేస్తున్నాం
గుంటూరు జిల్లాలో కరోనా కేసులు ఎక్కువ నమోదవుతున్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఆన్లైన్లో పత్రికల ద్వారా సమాచారం తెలుసుకుంటున్నాం. ఫోన్ద్వారా కుటుంబసభ్యులు, బంధువులను అప్రమత్తం చేస్తున్నాం. అమెరికాలో 24 గంటలు పని చేసే స్టోర్స్ ప్రస్తుతం 12 గంటలు మాత్రమే పని చేస్తున్నాయి. నిత్యావసరాల ధరలు పెంచకుండా అదుపులోనే ఉంచారు. - హర్షారెడ్డి గుదిబండి, బిజినెస్ ఎనలిస్ట్, న్యూజెర్సీ
గుంపులుగా ఉండటం తగదు
భౌతిక దూరం పాటిస్తేనే కరోనాను నియంత్రించగలం. జిల్లాలోనూ లాక్డౌన్ అమలు చేస్తున్నా ఉదయం 6 నుంచి 9 గంటల వరకు నిత్యావసరాలు, కూరగాయలు కొనుగోలు చేయడానికి పెద్దసంఖ్యలో ప్రజలు వస్తున్నారు. ప్రభుత్వమే సరకులు, కూరగాయలను ప్రతి ఇంటికి పంపిస్తే ప్రజలు గుంపులుగా ఉండకుండా చేయవచ్చు. తద్వారా వైరస్ వ్యాప్తిని సమర్థంగా అరికట్టవచ్చు. -- వాసిరెడ్డి సాయినాథ్, సాఫ్ట్వేర్ ఇంజినీర్, వాషింగ్టన్ డీసీ
ఇవీ చదవండి.. 'ఇంటికే పరిమితం అవ్వండి.. దీక్షా మాసాన్ని క్షేమంగా గడపండి'